
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సరదాగా తనను ముసలోడా(బుడ్డా)అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడని భారత పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. తన సతీమణి, భారత బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ కూడా అలాగే ఏడిపిస్తుంటుందని లంబూ చెప్పుకొచ్చాడు. వయసు పరంగా తనకు 32 ఏళ్ల వయసే, కానీ మానసికంగా, ఆలోచనపరంగా అంతకంటే ఎక్కువ ఎదిగానని, అందుకే వారు అలా అంటుంటారని వివరించాడు. తాజాగా క్రిక్ఇన్ఫో చాట్షో 'క్రిక్ బాజీ'లోభారత మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తాతో ఇషాంత్ మాట్లాడాడు.
"నా వయసు 32 ఏళ్లే అయినా శారీరకంగా, మానసికంగా అంతకంటే ఎక్కువ ఎదిగా. నా భార్య నన్ను ముసలోడా(బుడ్డా) అంటుంది. ధోనీ కూడా.. 'ఓల్డ్ మ్యాన్ ఎలా ఉన్నావు' అంటూ మేసెజ్ చేస్తుంటాడు. నాకు 32 ఏండ్లే మహీభాయ్ అని నేను రిప్లే ఇస్తా. అయితే 'నీ వయసు 32, కానీ, నీ శరీరానికి దాదాపు 52 సంవత్సరాలు ఉంటాయి' అని ధోనీ బదులిస్తాడు" అని ఇషాంత్ తెలిపాడు.
ఇక ధోనీ, ఇషాంత్ శర్మ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. టీమిండియా తరఫున ఎక్కువ కాలం కలిసి ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇషాంత్ కన్నా ధోనీ మూడేళ్ల సీనియర్. ఇషాంత్ కెరీర్లో ధోనీ అతనికి మూడో సారథి. ఇక ప్రస్తుతం ఆడుతున్న భారత ప్లేయర్లలో అత్యధిక టెస్టులు(97) ఆడిన ఆటగాడిగా ఇషాంత్ కొనసాగుతున్నాడు. అలాగే సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లకు ఇషాంత్ శర్మ మరో మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు.
భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే(619) అగ్రస్థానంలో ఉండగా.. కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్ (417), అశ్విన్ (365), జహీర్ ఖాన్(311)లు ఇషాంత్ కన్నా ముందు వరసలో ఉన్నారు. ఇక 100 టెస్ట్లకు ఇషాంత్ మరో మూడు మ్యాచ్లకు దూరంలో ఉన్నాడు.
ఇక ధోనీ, ఇషాంత్ ఇద్దరూ ఐపీఎల్లోనే కనిపించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్లో ధోనీ చైన్నై సూపర్ కింగ్స్ను నడిపించనుండగా.. ఇషాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.