న్యూఢిల్లీ: 'అర్జున'అవార్డుకు ఎంపికవ్వడంపై టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలం అర్జున అవార్డు అని అభివర్ణించాడు. ఈ అవార్డు పట్ల తనకంటే కూడా కుటుంబం, ముఖ్యంగా భార్య ప్రతిమా సింగ్ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ఇషాంత్ పేర్కొన్నాడు. అర్జునపై ఇషాంత్ రియాక్షన్ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
'అర్జున అవార్డు నన్ను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉన్నా. గర్వంగా కూడా ఫీలయ్యా. గత 13 ఏళ్లుగా ఎంతో హార్డ్ వర్క్ చేశా. అందువల్ల నాతో పాటు నా కుటుంబం గర్విస్తోంది. నిజానికి నాకంటే నా భార్య ప్రతిమ ఎక్కువ ఆనందించింది. ఎందుకంటే నాకు అవార్డు రావాలని ఆమె ఎప్పట్నించో కోరుకుంటోంది.'అని ఇషాంత్ చెప్పాడు.
'A proud moment for me and my family,' @ImIshant on winning the Arjuna Award for 2020.#TeamIndia pic.twitter.com/VbVdWN0qWE
— BCCI (@BCCI) August 24, 2020
2007లో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇషాంత్... ఇప్పటివరకు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. వచ్చే శనివారం అంటే ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆన్లైన్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఇషాంత్ ఈ అవార్డును స్వీకరించనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం దుబాయ్లో ఉన్న ఇషాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో సత్తాచాటి పరిమిత ఓవర్ల క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
ఇక టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న వరించగా.. మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అర్జునకు ఎంపికైన విషయం తెలిసిందే. క్రీడా చరిత్రలోనే తొలిసారిగా ఖేల్రత్నకు ఐదుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. రోహిత్తో పాటు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ ఖేల్రత్న అందుకోనున్నారు.
లక్ష్మణ్ అనే నేను హామీ ఇస్తున్నా.. ఖాళీ స్టేడియాల్లో జరిగినా క్వాలిటీలో తేడా ఉండదు!