
చెన్నై: టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో మూడు వికెట్లు తీసిన లంబూ సంప్రదాయక ఫార్మాట్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్లో డానియల్ లారెన్స్(18)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఇషాంత్.. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. లారెన్స్ రివ్యూకెళ్లినా ఫలితం దక్కలేదు.
ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లతో కలుపుకొని ఈ వికెట్తో 300 వికెట్ల మార్కును అందుకున్న ఇషాంత్.. భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న మూడో పేసర్గా, ఆరో బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇషాంత్ కన్నా ముందు కపిల్ దేవ్(434), జహీర్ ఖాన్ (311) ఈ ఘనతను అందుకున్నారు. ఇక భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే(619) అగ్రస్థానంలో ఉండగా.. కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417), రవిచంద్రన్ అశ్విన్ (382) ఇషాంత్ శర్మ (300) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో వెన్ను గాయానికి గురైన లంబూ.. దాంతోనే ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. అనంతరం ఎన్సీఏలో చికిత్స తీసుకొని ఇంగ్లండ్తో బరిలోకి దిగాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 241 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండటంతో అశ్విన్ చెలరేగుతున్నాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే ఓపెనర్ రోరీ బర్న్స్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన అశ్విన్.. ఆ తర్వాత డామ్ సిబ్లీ(16)ను కూడా క్యాచ్ ఔట్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన జోరూట్(27 బ్యాటింగ్)తో లారెన్స్ కొంచె పోరాడినా ఇషాంత్ వికెట్ల ముందు బోల్తా కొట్టించి దెబ్బ తీశాడు. ఆ వెంటనే బ్యాటింగ్కు వచ్చిన స్టోక్స్ను అశ్విన్ కీపర్ క్యాచ్గా వెనక్కిపంపాడు. ప్రస్తుతం 19 ఓవర్లకు ఇంగ్లండ్ 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. దాంతో 313 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రూట్తో పాటు పోప్(5) ఉన్నారు.