
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో టీ20లో టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 57), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) అదరగొట్టారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఈ యువ ఓపెనర్లు.. అసలు సిసలు మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తింది.
అయితే సౌతాఫ్రికా స్పిన్నర్ టబ్రైజ్ షంసీ.. ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్తో గొడవపడ్డాడు. తన బౌలింగ్లో సిక్స్ బాదడాన్ని తట్టుకోలేకపోయిన షంసీ.. మరుసటి బంతిని కట్టుదిట్టంగా వేసి ఎగతాళి చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇషాన్ ధీటుగా బదులిచ్చాడు. దాంతో మైదానంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే..? షంసీ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో నాలుగో బంతిని ఇషాన్ కిషన్.. భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరుసటి బంతిని బ్యాక్ వార్డ్ పాయింట్ దిశగా రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో కిషాన్ విఫలమయ్యాడు. ఇది చూసిన షంసీ ఇషాన్ను ఎగతాళి చేశాడు. ఇక మరుసటి బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించిన ఇషాన్.. షంసీ నోరు మూయించాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని ఇతర బ్యాటర్లు అందిపుచ్చుకోకపోవడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. డ్వేన్ ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, టబ్రైజ్ షంసీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. ఓపెనర్లు ఇద్దరు ఔటైన తర్వాత భారత్ 33 బంతులపాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. చివర్లో హార్దిక్ ధాటిగా ఆడటంతో ప్రత్యర్థి ముందు భారత్ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. 13.4 ఓవర్లకు 131/3తో ఉన్న భారత్.. చివరి 26 బంతుల్లో 48 పరుగులే చేసింది.