
ఏబీడీ లోటును తీర్చేందుకు..
ఈ క్రమంలోనే టీమ్ను పటిష్ట పరుచుకోవాలని మైక్ హెస్సెన్ నేతృత్వంలోని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను టార్గెట్ చేసిన ఆ జట్టు.. ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను తీసుకోవాలనుకుంటుంది.
హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఇషాన్ కిషన్ తమ టీమ్కు సెట్ అవుతాడని భావిస్తోంది. వికెట్ కీపర్ ఆప్షన్స్గా జానీ బెయిర్ స్టో, కేఎస్ భరత్లను కూడా పరిశీలిస్తున్న ఆర్సీబీ.. ఇషాన్ కిషన్నే మొదటి టార్గెట్గా పెట్టుకుంది.

ఇషాన్ కిషన్ రాకతో..
గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్కు ఆడిన ఇషాన్ కిషన్ ఆ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా జట్టులో ఉన్న అతను ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తూ మెరుపులు మెరిపించాడు. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ అతన్ని వేలంలోకి వదిలేసింది.
అయితే ఆక్షన్లో మళ్లీ తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో అతను కొత్త జట్లలోకి వెళ్లకుండా వేలానికి అందుబాటులో ఉన్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. ఇషాన్ కిషన్ రాకతో ఆర్సీబీకి రెండు సమస్యలు తీరనున్నాయి. ఓపెనింగ్ బ్యాట్స్మన్గా.. వికెట్ కీపర్గా అతను జట్టులో కీలకం కానున్నాడు.

జార్ఖండ్ కీపర్కు జాక్పట్ ధర..
రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న ఇషాన్ కిషన్కు భారీ ధర పలికే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు హిట్టింగ్ సామర్థ్యం ఉన్న జార్ఖండ్ కీపర్ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడే అవకాశం ఉంది. వికెట్ కీపర్లు ఉన్న చెన్నై, లక్నో, ఢిల్లీ మినహా అన్ని జట్లు అతని కోసం ప్రయత్నించనున్నాయి.
టీమ్ భవిష్యత్తు దృష్ట్యా అతను కెప్టెన్సీకి కూడా పనికొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇషాన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ఈ క్రమంలోనే అతను రూ.10 కోట్ల నుంచి రూ.17 కోట్లు పలికే చాన్స్ ఉంది. అయితే 10 కోట్ల లోపు చిక్కితే ఆర్సీబీ తీసుకోవచ్చు.

17 ఏళ్ల వయసులో..
జార్ఖండ్ టీమ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటడంతో ఇషాన్ కిషన్ 17 ఏళ్ల వయసులోనే గుజరాత్ లయన్స్ తరఫున అరంగేట్ర చేశాడు. ఆ వేలంలో గుజరాత్ అతన్ని రూ.35 లక్షల కనీస ధరకు తీసుకుంది. ఆ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిన ఇషాన్.. 42 రన్స్ మాత్రమే చేశాడు. ఇక 2017 సీజన్లో 11 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీతో 277 పరుగులు చేశాడు.
అండర్ 19 ప్రపంచకప్ కెప్టెన్గా సత్తా చాటడంతో 2018 మెగా వేలంలో ముంబై ఇండియన్స్.. ఇషాన్ కిషన్ను రూ. 6.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్ 2020 సీజన్లో 516 పరుగులతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్గా.. ఇప్పటి వరకు 61 మ్యాచ్లు ఆడిన ఇషాన్..9 హాఫ్ సెంచరీలతో 1452 రన్స్ చేశాడు.


Click it and Unblock the Notifications
