
ఛటోగ్రామ్: బంగ్లాదేశ్తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కెరీర్లో సాధించిన తొలి సెంచరీనే డబుల్గా మలిచిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులను అధిగమించాడు. ముస్తాఫిజుర్ అహ్మద్ వేసిన 35వ ఓవర్లో క్విక్ సింగిల్తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ 126 బంతుల్లోనే ఈ ద్విశతకాన్ని సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. అయితే విరాట్ కోహ్లీ సహకారంతోనే ఈ ద్విశతకం సాధ్యమైందని ఇషాన్ కిషన్ తెలిపాడు. ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ఇషాన్.. సెంచరీ మార్క్ ముందు ప్రశాంతంగా ఆడాలని కోహ్లీ పదే పదే చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.
అతని సూచనలతో సెంచరీ మార్క్ అందుకున్న తాను ద్విశతకం సాధించగలిగానని తెలిపాడు. మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్తో మాట్లాడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. బంతిని స్పష్టంగా చూడాలని, ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడాలని సూర్యకుమార్ తనకు సూచించాడని తెలిపాడు. డబుల్ సెంచరీతో దిగ్గజాల సరసన చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
'పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. దాంతో ప్రతీ బంతిని హిట్ చేయాలనే ఇంటెంట్తో ఆడాను. డబుల్ సెంచరీతో దిగ్గజాల సరసన నా పేరు చేరడం అదృష్టంగా భావిస్తున్నా. నేను అనవసరంగా ఔటయ్యాననే ఫీలింగ్ కలిగింది. నేను ఔటయ్యే సమయానికి ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలుంది. 300 స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉందనిపించింది. విరాట్ భాయత్తో బ్యాటింగ్ చేయడం బాగుంది.
నేను 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆడమని పదే పదే చెప్పాడు. నేను మాత్రం సిక్స్ కొట్టాలని చూసా. కానీ విరాట్ భాయ్ మాత్రం సింగిల్స్ తీసుకోమని, ఇది నీ తొలి సెంచరని గుర్తు చేశాడు. మ్యాచ్కు ముందు సూర్య భాయ్తో మాట్లాడాను. బంతిని స్పష్టంగా చూడాలని, ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడాలని చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీకి అండగా విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 113) శతక్కొట్టడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 409 పరుగులు చేసింది.