తానొక్కడివల్లే పాకిస్థాన్పై విజయం దక్కలేదని, సమష్టి ప్రదర్శనతో ఈ గెలుపు సాధ్యమైందని టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో సూపర్-8 బెర్త్ను దక్కించుకోవడంతో పాటు పాక్పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఏ దశలోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.

ఈ అవార్డ్ స్వీకరణ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. 'ఈ వికెట్ బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు. కొన్నిసార్లు మన బలాన్ని నమ్ముకొని ఏకాగ్రతతో ఆడాలి. నేను కేవలం బంతిని గమనిస్తూ.. నా బలానికి తగ్గట్లు ఆడాను. నా ఆఫ్-సైడ్ గేమ్ మీద నేను చాలా
కసరత్తు చేశాను. అందుకే బౌలర్లు నా ఏరియాలో బౌలింగ్ చేసేలా చేయగలిగాను. మైదానం పెద్దది కావడంతో గ్యాప్లు ఎక్కువగా దొరికాయి. గ్యాప్ షాట్స్ ఆడుతూ క్విక్ డబుల్స్ తీయడానికి ప్రయత్నించాను. 160-170 పరుగులు మాకు మంచి స్కోరు అని తెలుసు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. అది కేవలం మాకే కాదు యావత్ దేశానికి ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనది. పాక్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పాకిస్థాన్పై సాధించిన ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఇక బుమ్రా, హార్దిక్ విషయానికొస్తే.. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించినట్లు అనిపించలేదు. కానీ బుమ్రా కొత్త బంతితోనైనా, డెత్ ఓవర్లలోనైనా ఎలా బౌలింగ్ చేయగలడో అందరికి తెలుసు. అలాగే హార్దిక్ తన ప్రణాళికలను చక్కగా అమలు చేస్తూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. ఈ గెలుపులో అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.