అభిషేక్ శర్మ సాయంతోనే సెంచరీతో చెలరేగానని టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు.
వ్యక్తిగత రికార్డుల కోసం తాను ఆడనని, జట్టు విజయమే తనకు ముఖ్యమని చెప్పాడు. బ్యాటర్గా తాను ఇంకా సంతృప్తి చెందలేదని, టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103)విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. తన ఫోకస్ అంతా ప్రపంచకప్పైనే ఉందని తెలిపాడు. 'నిజం చెప్పాలంటే.. పెద్దగా ఏం ఆలోచించలేదు. ఆరంభంలో బంతి కొంచెం స్వింగ్ అవుతుట్లు అనిపించింది. కానీ అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నా ఇన్నింగ్స్కు ఉపయోగపడింది. తన ఇంటెంట్, జట్టుకు కావాల్సిన వేగాన్ని చూసినప్పుడు, మనం కూడా బంతిని గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఆడటానికి ప్రయత్నిస్తాం. ఆ విధానం ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది.

వ్యక్తిగత మైలురాళ్లు గురించి నేను ఆలోచించాను. మా జట్టులో ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం కూడా ఇదే. ఒక మైలురాయికి చేరువలో ఉన్నా సరే.. అది పెద్ద విషయం కాదు. ఆ సమయంలో సింగిల్స్ తీయడం మొదలుపెడితే, తర్వాత పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయామే అనే బాధ కలించవచ్చు. అందుకే బంతి కొట్టే విధంగా ఉంటే, కచ్చితంగా వెళ్లాల్సిందే. మా ఫోకస్ అంతా మ్యాచ్లు గెలవడంపైనే ఉంది. వ్యక్తిగత రికార్డులపైన కాదు.
బ్యాటర్గా ఇంకా నేను ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ మ్యాచ్లో నేను బాగా ఆడాను. అవార్డులు కూడా వస్తున్నాయి. కానీ నా దృష్టంతా ప్రపంచకప్పైనే ఉంది. అక్కడే అదనపు శ్రమ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫామ్ను అలాగే కొనసాగిస్తూ.. అక్కడ జట్టు విజయంలో భాగస్వామిని కావడం నాకు అత్యంత ముఖ్యం.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(1/53), కైల్ జెమీసన్(1/59), మిచెల్ సాంట్నర్(1/60) హాఫ్ సెంచరీలు సమర్పించుకోగా. లాకీ ఫెర్గూసన్(2/41) కాస్త కట్టడిగా బౌలింగ్ చేశాడు.
న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిన్ అలెన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(3/33) మూడు వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీ(1/36), రింకూ సింగ్(1/7) తలో వికెట్ పడగొట్టారు. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా.. న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.