ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఎప్పటిలాగే తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చిన టీమిండియా 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన భారత్కు తిరుగులేని విజయాన్ని అందించింది.
అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్.. పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్కు క్షమాపణలు చెప్పాడు. క్విక్ రన్ తీసే క్రమంలో ఇషాన్ కిషన్, ఉస్మాన్ ఖాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. వాస్తవానికి ఉస్మాన్ ఖానే తనను ఢీకొట్టినప్పటికీ.. ఇషాన్ కిషన్ నవ్వుతూ క్షమాపణలు చెప్పాడు. ఇషాన్ సారీకి ఉస్మాన్ ఖాన్ ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి తన బలుపును చూపించాడు.
ఇషాన్ కిషన్ మాత్రం అతన్ని పట్టించుకోకుండా బంతిపై తన ప్రతాపం చూపించాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వేసిన మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని స్వీప్ షాట్ ఆడిన ఇషాన్ కిషన్.. క్విక్ డబుల్ తీసాడు. క్రీజులోకి వచ్చే సమయంలో అతనికి అడ్డుగా పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ రావడంతో ఒకరినొకరు ఢీకొట్టుకున్నారు. తన తప్పిదం లేకున్నా సారీ చెప్పి ఇషాన్ కిషన్ క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తే.. పాక్ ఆటగాడు మాత్రం బలుపు చూపించాడు. మ్యాచ్ను నిశితంగా చూసిన వారికి ఈ ఘటన గురించి తెలుస్తోంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. నెదర్లాండ్స్తో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.