
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్లో ఆడేందుకు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన యువీ.. అబుదాబి వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 కెనడా టీ10 లీగ్లో పాల్గొన్నాడు. తద్వారా ఓవర్సీస్ టీ20 లీగ్ ఆడిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో పాల్గొవడానికి యువీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి ఎన్ఓసీ కూడా తీసుకున్నాడు.
అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే బిగ్ బాష్ లీగ్లో పాల్గొవాలని యువీ భావిస్తున్నాడని అతని మేనేజర్ జాసన్ వార్న్ మీడియాకు తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో ఈ దిశగా చర్చలు కూడా జరుపుతున్నామన్నాడు. ఇక వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా యువీ పాల్గొంటాడని ప్రచారం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకోవద్దనే భావనతోనే ఆఖరి క్షణంలో ఈ లీగ్ నుంచి యువీ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఇక 2013-14లో సిడ్నీ థండర్ సచిన్ సంప్రదించింది. కానీ ఆ చర్చలు కార్యరూపం దాల్చలేదు. ఇక 2017లో భారత జట్టులో చోటు కోల్పోయిన యువీ.. గత సీజన్ ఐపీఎల్ అనంతరం అన్ని రకాల క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అయితే యువరాజ్ సింగ్పై ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్లో ఏ మేరకు ఆసక్తికనబరుస్తాయో చూడాలి.
ఇక భారత తరఫున కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన ఏకైక భారత ఆటగాడిగా ప్రవీణ్ తాంబే గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అతను యూఏఈ వేదికగా జరిగిన టీ10 లీగ్ కూడా ఆడాడు. మన్ప్రీత్ గోనీ, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్లు కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత టీ10 లీగ్ ఆడారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు కౌంటి క్రికెట్ మినహా ఇతర లీగ్స్ ఆడటానికి వీల్లేదు.