
హైదరాబాద్: కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 సీజన్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే సోమవారం జరగాల్సిన ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడింది. ఊహించని విధంగా ఇద్దరు ప్లేయర్లు, ఓ కోచ్ కరోనా బారిన పడడంతో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ వేదికగా నేడు(మంగళవారం) జరిగే ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా ఆగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబై, సన్రైజర్స్ టీమ్స్ సోమవారం తమ ప్రాక్టీస్ను రద్దు చేసుకోవడం దీనికి బలం చేకూరుస్తోంది.
మరోవైపు ఐపీఎల్ వేదికల్లో ఒకటైన ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదాన సిబ్బందికి కరోనా వచ్చిందని వార్తలు రావడం ఆందోళన రెకెత్తించింది. అయితే డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ దీనిని ఖండిస్తూ, లీగ్ విధుల్లో ఉన్నవారెవరూ ఆ జాబితాలో లేరని స్పష్టం చేశారు. బీసీసీఐ కూడా లీగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అయితే ఈ విపత్కర పరిస్థితుల నడుమ ఈ టోర్నీ కొనసాగుతుందనేది అనుమానేమనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక నేటి మ్యాచ్ జరుగుతుందా? రద్ద అవుతుందా? అని నెట్టింట్లో ఒకటే సెర్చ్ చేస్తున్నారు. అయితే విశ్లేషకులు, బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాత్రం నేటి మ్యాచ్కు ఎలాంటి డోకా లేదంటున్నారు.
ఇక పాయింట్స్ టేబుల్ల్లో చివరి ప్లేస్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో రెండోసారి తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్ల్లో కనీసం ఆరైనా నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్న హైదరాబాద్కు ఈ పోరు చావోరేవో లాంటిదే. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గిన ముంబై ఇండియన్స్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
అదే జోరులో హ్యాట్రిక్ విజయాన్నందుకోవాలనే పట్టుదలతో ఉంది. కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలో గత పోరులో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన రైజర్స్ డీలా పడింది. ముంబైపై గెలిస్తే మాత్రం కాన్ఫిడెన్స్ అమాంతం పెరగడం ఖాయం. కానీ, డిఫెండింగ్ చాంప్ను ఓడించాలంటే అద్భుతం చేయాల్సిందే.