టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రన్నింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్లలో ధోనీ ఒకడు. మిడిల్ ఓవర్లలో అతనితో క్రీజులో ఉంటే సహచర బ్యాటర్లు ధోనీతో పరుగెత్తలేక ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా తాను టీమిండియాకు ఆడే రోజుల్లో రన్నింగ్ పోటీల్లో ధోనీని ఎవరూ ఓడించేవారు కాదు. ప్రాక్టీస్ సెషన్లో ధోనీతో సహచర ఆటగాళ్ల రన్నింగ్ రేసుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.
హార్దిక్ పాండ్యా కూడా ధోనీని రన్నింగ్ రేసులో ఓడించలేకపోయాడు. ఇక వికెట్ కీపర్గా ధోనీ ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెప్పపాటులో స్టంపింగ్ చేయాలన్నా.. వికెట్ల వైపు చూడకుండా రనౌట్ చేయాలన్నా అది ధోనీకే సాధ్యం. అందుకే ధోనీ వికెట్ల వెనుకాల ఉండగా.. బ్యాటర్లు క్రీజును ధాటేందుకు జంకుతారు.

అయితే ధోనీ చేసిన ఓ రనౌట్ తాజాగా చర్చనీయాంశమైంది. వరల్డ్ బెస్ట్ స్ప్రింటన్, జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా ధోనీ పరుగెత్తి రనౌట్ చేశాడనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2016లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి ధోనీ చేసిన రనౌట్ ఇప్పటికీ అతని అభిమానులు మరిచిపోలేరు. అయితే ఈ రనౌట్ సరికొత్త రికార్డ్ను నమోదు చేసిందని ధోనీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి. క్రీజులో శువ్గట హమ్ ఉండగా.. హార్దిక్ పాండ్యా బంతి బ్యాట్కు తగలకుండా వేసాడు. అప్పటికే ఒక గ్లోవ్ తీసి రనౌట్ చేసేందుకు రెడీగా ఉన్న ధోనీ బంతిని అందుకొని వేగంగా పరుగెత్తి వికెట్లను కొట్టేసాడు. దాంతో ఈ మ్యాచ్ టై కాకుండా భారత్ విజయం సాధించింది.
అయితే ధోనీ 13 మీటర్ల దూరాన్ని 2 సెకన్లలోనే పూర్తి చేసి ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రనౌట్ చేశాడు. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్తో సమంగా ధోనీ పరుగు తీసాడని అతని ఫ్యాన్స్ లెక్కేస్తున్నారు. ధోనీ, ఉసేన్ బోల్ట్ రన్నింగ్ చేసిన సందర్భం వేరైనా పరుగు తీయడంలో ఇద్దరూ ఉద్దండులే అని అభిమానులు అభిప్రాయపడ్డారు. ధోనీ కేవలం 13 మీటర్ల దూరం మాత్రమే పరుగెత్తాడు.. ఉసేన్ బోల్ట్ స్ప్రింట్ దిగ్గజమని, ఇద్దర్ని సరిపోల్చడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.