
న్యూఢిల్లీ: భారత తుది జట్టు ఎంపికలో బీసీసీఐ సెక్రటరీ జై షా జోక్యం ఎక్కువైందా? గుజరాతీ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత లభిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు గత మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బంగ్లాతో తొలి టెస్ట్లో 8 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ను తప్పించి 12 ఏళ్ల తర్వాత టెస్ట్ టీమ్లోకి ఎంపికైన జయదేవ్ ఉనాద్కత్ను తీసుకోవడంతోనే ఈ సందేహాలు మొదలయ్యాయి. జయదేవ్ ఉనాద్కత్ కోసం కుల్దీప్ యాదవ్తో పాటు పేస్ ఆల్రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ను పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా పేసర్ కోసం కుల్దీప్ యాదవ్పై వేటు వేసామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేసినా.. ఉనాద్కత్కు అవకాశం ఇవ్వడం వెనుక బీసీసీఐ సెక్రటరీ జై షా ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీసీఐలోకి జై షా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గుజరాతీ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత లభిస్తుందనేది కాదనలేని సత్యం. రోహిత్ శర్మకు బ్యాకప్గా అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక చేయడం గానీ.. అక్షర్ పటేల్ను ప్రతీ మ్యాచ్ ఆడించడానికి గుజరాతీలు కావడమే ప్రధాన కారణంగా అర్థమవుతోంది.
ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే జట్టులో ఉన్న శార్దూల్ ఠాకూర్కు అవకాశం ఇవ్వాలి. ప్రధాన జట్టులో అతనే ఉన్నాడు. కానీ గుజరాత్ ప్లేయర్ అయిన జయదేవ్ ఉనాద్కత్ను ఎంపిక చేశారు. అది కూడా ఐపీఎల్ 2023 మెగా వేలానికి ఒక్క రోజు ముందు అవకాశం ఇవ్వడం అనేక సందేహాలకు తావిచ్చింది. దేశవాళీ క్రికెట్లో జయదేవ్ ఉనాద్కత్ రాణించిన మాట వాస్తవమే.. ఆ ప్రదర్శనతో అతన్ని జట్టుకు ఎంపిక చేయడం కూడా సరైనదే. కానీ ఉనాద్కత్ కోసం మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టడంపైనే మాజీ క్రికెటర్లు, అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఉనాద్కత్ను ఆడించాలనుకున్నప్పుడు అక్షర్ పటేల్పై వేటు వేయాల్సింది. తొలి టెస్ట్లో అక్షర్ పెద్దగా రాణించిందేం లేదు కూడా. కానీ అక్షర్ పటేల్ గుజరాత్ ప్లేయర్ కావడంతో అతన్ని పక్కనపెట్టని టీమ్మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్ను బెంచ్కు పరిమితం చేసింది. ఈ క్రమంలోనే భారత తుది జట్టు ఎంపికలో జై షా జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ తెలుగు కామెంటేటర్ సీ వెంకటేశ్ సైతం ట్విటర్ వేదికగా ఇదే సందేహం వ్యక్తం చేశారు.