
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. తాను మళ్లీ వస్తానని చెప్పినా.. టీమ్మెనేజ్మెంట్ పెద్దగా ఆసక్తికనబర్చలేదు. అయితే సురేశ్ రైనా స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం డేవిడ్ మలన్ తీసుకోవాలనే ప్రయత్నాలు సీఎస్కే మేనేజ్మెంట్ చేస్తుందని తెలుస్తోంది . ఈ విషయమై సీఎస్కే క్యాంప్లో చర్చలు కూడా జరుగుతున్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది.
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో డేవిడ్ మలన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్లో ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ 138.70 స్ట్రైక్ రేట్తో 129 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో 16 మ్యాచ్లే ఆడిన మలన్ అతి తక్కువ కాలంలోనే నంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇక రైనాలాగే మలన్ కూడా లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ కావడంతో జట్టుకు సరిగ్గా సరిపోతాడని చెన్నై వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. 'రైనా స్థానంలో డేవిడ్ మలన్ తీసుకుంటే ఎలా ఉంటుందనేదానిపై కేవలం చర్చలు మాత్రమే జరిగాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మలన్ టీ20 ఫార్మాట్కు సరిపోయే ఆటగాడు. రైనాలానే లెఫ్టార్మ్ కూడా. అయితే రైనా స్థానంలో మలన్ను భర్తీ చేయాలా? వద్దా? అనే విషయంపై టీమ్మెనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.'అని సీఎస్కే టీమ్ అధికారి ఒకరు తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.

ఇక రైనా స్థానంలో మలన్ సరిగ్గా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆటగాడిలానే మూడో స్థానంలో బరిలోకి దిగే మలన్.. తన 16 టీ20 మ్యాచ్ల్లో ఓ అజేయ సెంచరీతో 682 పరుగులు చేశాడని, 48.71 సగటుతో చెలరేగిన ఈ బ్యాట్స్మన్ ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైకు మంచి అవకాశమని సూచిస్తున్నారు.
ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉండటం కూడా జట్టుకు కలిసివస్తుందంటున్నారు. ఫారిన్ ప్లేయర్ అనే ఒకే ఒక్క కారణంతో మలన్ విషయంలో చెన్నై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ మలన్ను తీసుకుంటే ఫారిన్ ప్లేయర్ల కోటా ప్రకారం తుది జట్టు ఎంపిక సమస్య అవుతుందని, జట్టు సమతూకం దెబ్బతినే అవకాశం ఉందని సీఎస్కే భావిస్తోందని సమాచారం.