న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమ రెండో బిడ్డకు సంబంధించి కోహ్లీ-అనుష్క శర్మ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే అనుష్క శర్మ.. కోహ్లీతో కలిసి ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్కు వచ్చినట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని, ఫొటోలు తీయవద్దని సదరు చానెల్ జర్నలిస్ట్ను విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది.

ప్రెగ్నెన్సీ కారణంగానే అనుష్క శర్మ.. కోహ్లీతో కలిసి క్రికెట్ పర్యటనలకు వెళ్లడం లేదని, మీడియాకు కూడా దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.
గతంలో అనేక సార్లు ఈ రూమర్లు రాగా.. అవన్నీ గాలివార్తలేనని తర్వాత స్పష్టమైంది. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇలాంటి వార్తలే రాగా.. విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క శర్మ ఓ యాడ్ ఫొటో షూట్లో పాల్గొంది. దాంతో అవన్నీ గాలి వార్తలేనని స్పష్టమైంది.
ఇక కోహ్లీ-అనుష్క దంపతులకు 2021లో ఓ పాప జన్మించింది. ఆమెకు వామికా అని పేరు పెట్టారు. ఆ చిన్నారి ఫొటోలు బయటకు రాకుండా ప్రైవసీ మెయింటేన్ చేస్తున్నారు. మీడియాకు కూడా తన కూతురు ఫొటోలను ప్రచురించవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వన్డే ప్రపంచకప్ కోసం విరాట్ కోహ్లీ సిద్దమవుతుండగా.. అనుష్క సినిమాలకు దూరంగా ఉంటూ కూతురుతో గడుపుతోంది.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరగాల్సిన వామప్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఇంకా మ్యాచ్ ప్రారంభం కాలేదు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్ను ప్రారంభించనుంది.