
సౌతాంప్టన్: విశ్వవిజేత ఇంగ్లండ్కు పసికూన ఐర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. భారీ లక్ష్యాన్ని చేధించి యావత్ క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. కరోనా బ్రేక్ తర్వాత జరిగిన తొలి వన్డే సిరీస్ ఇంగ్లండ్ గెలుచుకున్నా.. ఆఖరి ఆటలో అదరగొట్టిన ఐర్లాండ్ ప్రత్యర్థి ఆనందాన్ని ఆవిరి చేసింది. సిరీస్ గెలవకున్నా యావత్ క్రికెట్ అభిమానుల మనసులను దోచుకుంది. ఐర్లాండ్తో వ్యవహారం డేంజర్ అనే సంకేతాలు ప్రతర్థి జట్లకు పంపింది.
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ మోర్గాన్(106) సెంచరీతో చెలరేగగా.. టామ్ బాంటన్(58), విల్లే(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ ... ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (128 బంతుల్లో 142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (112 బంతుల్లో 113; 12 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో 49.5 ఓవర్లలో ఛేదించింది. పాల్ స్టిర్లింగ్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
అయితే ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన ఐర్లాండ్ వ్యాఖ్యాత మైఖేల్ మెక్నేమీ తన సంతోషాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఐర్లాండ్ బ్యాట్స్మన్ కెవిన్ ఓ బ్రైన్ (21) పరుగు తీయడంతో ఐర్లాండ్ విజయం ఖాయమైంది. ఈ క్షణాన తెగ ఆనందపడ్డ మైఖేల్ గట్టిగా అరుస్తూ కామెంట్రీ చెప్పాడు.
'సౌతాంప్టన్లో ఐర్లాండ్ గెలిచింది. కెవిన్ ఓ బ్రైన్ బంతిని హిట్ చేసి పరుగును పూర్తి చేశాడు. ఐర్లాండ్ లక్ష్యచేధన పూర్తయింది. మీరు నమ్ముతారా? కెవిన్ ఓ బ్రైన్ 2011లో బెంగళూరు వేదికగా తన ఆటతో హీరోగా నిలిచాడు. మళ్లీ అలాంటి పెర్ఫామెన్స్ 2020 సౌతాఫ్టంన్ వేదికగా కనబర్చాడు. ఐర్లాండ్ అద్భుత విజయాన్నందుకుంది. ఐరీష్ ఆటగాళ్లు ఇంగ్లండ్ను వారి సొంత గడ్డపై ఓడించారు. విశ్వవిజేతను ఓడించి ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది.'అని మైఖేల్ ఎక్జైట్ అయ్యాడు. ఇది చూసిన అతని సహచర కామెంటేర్లు నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఇక భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్లో కూడా ఇంగ్లండకు ఐర్లాండ్ షాకిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో 328 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి సంచలన విజయాన్నందుకుంది. కెవిన్ బ్రైన్ (113) సెంచరీతో చెలరేగి విజయం కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయాన్ని మైఖేల్ తన కామెంట్రీలో ప్రస్తావించాడు.