టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన ఆరోపణలు చేశాడు. హుక్కా తాగలేదనే కారణంతోనే ధోనీ తనను జట్టు నుంచి తప్పించాడని పేర్కొన్నాడు. ధోనీ పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తాతో తాజాగా జరిగిన సంభాషణలో ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా తనను జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు. ఇందుకు మైదానం బయట జరిగిన విషయాలే కారణమని చెప్పాడు. 2008లో ఆస్ట్రేలియాతో సిరీస్లో తాను బాగా బౌలింగ్ చేయలేదని ధోనీ మీడియాతో చెప్పిన ఘటనను పఠాన్ గుర్తు చేసుకున్నాడు.
'2008లో ఆస్ట్రేలియా పర్యటనలో నేను బౌలింగ్ బాగా చేయలేదని ధోనీ మీడియాతో అన్నారు. ఈ విషయంపై నేను ధోనీని అడిగాను. ఆ సిరీస్ మొత్తం నేను బాగానే బౌలింగ్ చేశాను. కొన్నిసార్లు మీడియాలో ఆటగాళ్ల మాటలు వక్రీకరిస్తారు. దాంతోనే క్లారిటీ కోసం ధోనీని వివరణ కోరాను. అందుకు అతను అలా అనలేదని, ప్రణాళికల ప్రకారమే జట్టు ముందుకు సాగుతోందని బదులిచ్చాడు. అలాంటి సమాధానం వచ్చిన తర్వాత ఏ ఆటగాడైనా తన ప్రదర్శనపై మాత్రమే ఫోకస్ పెడుతాడు. ఆ తర్వాత కూడా పదే పదే వివరణలు అడిగితే ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అవుతుంది.

ఎవరి గదిలోనో హుక్కా ఏర్పాటు చేయడం, దాని గురించి మాట్లాడటం నాకు అలవాటు లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. కొన్నిసార్లు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఒక క్రికెటర్ పని మైదానంలో బాగా ఆడటం మాత్రమే. నేను దానిపైనే దృష్టి పెట్టేవాడిని.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు. హుక్కా విషయంలో ధోనీ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతన్ని ఉద్దేశించే పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడనే విషయం అర్థమవుతుంది. గతేడాది ధోనీ హుక్కా తాగుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతేకాకుండా జార్జ్ బెయిలీ కూడా ఓ ఇంటర్వ్యూలో ధోనీ అప్పుడప్పుడు సహచర ఆటగాళ్లతో హుక్కా తాగుతారని తెలిపారు. ఈ క్రమంలోనే ధోనీతో కలిసి హుక్కా తాగే ఆటగాళ్లకే భారత జట్టులో చోటు ఇచ్చేవాడనే ప్రచారం జోరందుకుంది.