స్పెషలిస్ట్ బ్యాటర్లు బౌలింగ్ చేయకపోవడమే ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణమని స్టార్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. తాను టీమిండియా హెడ్ కోచ్ అయ్యుంటే.. బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయాలనే రూల్ తీసుకొచ్చేవాడినని చెప్పాడు. నెట్స్లో బౌలింగ్ చేయించేవాడినని, అవసరమైనప్పుడు వారితో బౌలింగ్ చేయించేలా సిద్దం చేసుకునేవాడినని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియా టాప్ బ్యాటర్స్ అయిన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా బౌలింగ్లోనూ రాణించడంతోనే 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవగలిగామని పఠాన్ గుర్తు చేశాడు.

బ్యాటర్లు బౌలింగ్ చేయాలి..
'నేను టీమిండియా కోచ్గా ఉంటే బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయాలనే రూల్ తీసుకొచ్చే వాడిని. అవసరమైనప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లుగా వాడుకునేవాడిని. బౌలింగ్ చేయలేని బ్యాటర్లను పక్కన పెట్టేవాడిని. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్లలా టీమిండియాలో మార్పులు తీసుకొచ్చేవాడిని.
కేవలం బ్యాటర్లు అయితే వారు బౌలింగ్ చేయకున్నా ఏం కాదు. కానీ బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు బౌలింగ్ చేయాల్సిందే. టీమిండియా బలహీనంగా మారడానికి ఇదే కారణం. టాపార్డర్ బ్యాటర్లలో ఒక్కరు బౌలింగ్ చేసినా టీమ్ కాంబినేషన్కు ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..
ఇంగ్లండ్ జట్టులో లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, విల్ జాక్స్ బౌలింగ్ చేస్తారు. జట్టులో నలుగురు, ఐదుగురు ఫ్రంట్ బౌలర్లు ఉన్న తర్వాత కూడా బౌలింగ్ చేస్తారు. టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ ఉండాలంటే రెండు కాంబినేషన్స్ను ప్రయత్నించవచ్చు. అక్షర్ పటేల్ను ఆడించాలి. లేదా శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలను ఆడించాలి.
బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న టాపార్డర్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఒక్క ఓవర్ వేసినా టీమిండియాకు ఉపయోగపడుతుంది. అమెరికా పిచ్లపై ఎక్స్ట్రా పేసర్తో ఆడాలి. కానీ వెస్టిండీస్లో మాత్రం ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఆడించాలి. అప్పుడు ఇద్దరు పేసర్లు, మరో ఇద్దరిని పేస్ ఆల్రౌండర్లు తీసుకుంటే సరిపోతుంది.
రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా ఆడిస్తే అతను టాపార్డర్తో పాటు లోయరార్డ్లో కూడా ఆడగలడు. కానీ సంజూ శాంసన్ టాపార్డర్లో మాత్రమే ఆడుతాడు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.