ఆసియా కప్ 2025 టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండింటికి రెండు కూడా భారత్ గెలిచింది. ముచ్చటగా మూడోసారి దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్లో టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు. కానీ పాకిస్థాన్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఫైనల్లో పాకిస్థాన్తో పోరు అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని తట్టుకొని రాణించే జట్టునే విజయం వరిస్తుంది. అయితే ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే అర్ష్దీప్ సింగ్ను ఆడించాలని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. డెత్ ఓవర్లలో అర్ష్దీప్ సింగ్ కీలకమవుతాడని చెప్పాడు. 'పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్ను ఆడించాలి. ఎందుకంటే అర్ష్దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించగలడు. యార్కర్లను నిలకడగా వేయగలడు. ఒత్తిడిలో కెప్టెన్ను అడిగి మరి బౌలింగ్ చేస్తాడు.

ఓవైపు బుమ్రా.. మరోవైపు అర్ష్దీప్ సింగ్ యార్కర్లతో దాడి చేస్తే పాకిస్థాన్ బ్యాటర్లు ఇబ్బంది పడుతారు. తొలి రోజు నుంచి నేను ఇదే చెబుతున్నా. అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకోవాలి. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం బ్యాటింగ్ డెప్త్కు ప్రాధాన్యత ఇస్తుంది. దాంతోనే పేస్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబేను ఆడిస్తోంది. శివమ్ దూబే వల్లే అర్ష్దీప్ సింగ్కు జట్టులో చోటు లభించడం లేదు. కానీ అతను ఎప్పుడూ నా ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడు. శ్రీలంకతో మ్యాచ్లో అర్ష్దీప్ అవసరం ఏంటో తెలిసొచ్చింది. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ పునరాలోచన చేయాలి. 'అని సోనీ టీవీ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ విజ్ఞప్తి చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీయడంతో పాటు 100 వికెట్ల మైలు రాయి అందుకున్న బౌలర్గా అర్ష్దీప్ సింగ్ రికార్డ్ సాధించాడు. శ్రీలంకతో చివరి సూపర్-4 మ్యాచ్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్, సూపర్ ఓవర్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి.
టీమిండియా బ్యాటింగ్ డెప్త్కు ప్రాధాన్యత ఇస్తున్నా.. దుబాయ్ వంటి కండిషన్స్లో ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగడం ప్రమాదకరమని అశ్విన్ వంటి మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి మ్యాచ్ల్లో సెకండ్ ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు స్పెషలిస్ట్ పేస్ ఉండాలని సూచించాడు. డ్యూ వస్తే స్పిన్నర్లు ప్రభావం చూపించలేరని కూడా హెచ్చరించాడు. మరీ టీమిండియా మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.