భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువ మ్యాచ్లు ఆడేలా మరిన్ని వన్డేలను షెడ్యూల్ చేయాలని బీసీసీఐకి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిట్గా ఉండటంతో పాటు సూపర్ ఫామ్లో ఉన్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో పరుగుల మోత మోగించారు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో ఈ ఇద్దరు బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత భారత్కు వన్డే మ్యాచ్లు లేవు. ఈ క్రమంలోనే బీసీసీఐ.. మరిన్ని వన్డే మ్యాచ్లను నిర్వహించాలని పఠాన్ సూచించాడు.
'మనం మూడు వన్డేల సిరీస్ల బదులు ఐదు వన్డేల సిరీస్లు ఎందుకు ఆడకూడదు. ముక్కోణపు సిరీస్లు ఎలాగు నిర్వహించడం లేదు. మంచి విషయం ఏంటంటే.. ఇప్పటికీ కోహ్లీ, రోహిత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలి. ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోతే వారు దేశవాళీ క్రికెట్లోనైనా వరుసగా మ్యాచ్లు ఆడాలి.'అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

గతేడాది రోహిత్, కోహ్లీ టాప్ స్కోరర్లుగా నిలిచారు. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్ల్లో 65.10 యావరేజ్తో 651 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్ల్లో 50 సగటుతో 650 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలోనూ ఈ ఇద్దరూ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ తరఫున కోహ్లీ 131, 77 పరుగులు చేయగా.. ముంబై తరఫున రోహిత్ 155*, 0 రాణించాడు.
భారత ఐదు వన్డేల సిరీస్ను చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటి నుంచి కేవలం మూడు వన్డేల సిరీస్లు మాత్రమే ఆడుతోంది. 2015లో చివరిసారిగా ముక్కోణపు సిరీస్లో భారత్ ఆడింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ ట్రై సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడ్డాయి.