
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో తమ అభిమాన జట్టు గెలవకపోతే చాలు.. ఫిక్సింగ్ జరిగింది, స్క్రిప్టెడ్ గేమ్ అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ కామన్ అయిపోయింది. తమ ఊహాజనిత కథలతో గెలిచిన జట్టుపై లేనిపోని అబండాలు వేస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయం సాధించినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఈ తరహా కామెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. మొన్న ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ కామెంట్లు వినిపించాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్పై కూడా ఓ వర్గం అభిమానులు సందేహాం వ్యక్తం చేశారు.
కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిందని, అంతా ఫిక్సింగ్ అని చెప్పారు. ఫిక్సింగ్ కాబట్టే ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ఆఖరి ఓవర్ రబడాకు ఇవ్వకుండా టామ్ కరన్కు ఇచ్చాడని ఆరోపిస్తున్నారు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను ఢిల్లీ చేజేతులా చేజార్చుకుందని కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ తరహా వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రముఖ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా ఈ కామెంట్స్పై స్పందించిన పఠాన్.. ఇతర జట్ల విజయాలను గౌరవించాలని సూచించాడు. మ్యాచ్ ఫలితాలపై సొల్లు కథలను ఆపాలని సూచించాడు. మొన్న ముంబై- హైదరాబాద్ మ్యాచ్ అప్పుడు ఇలానే అన్నారని, తాజాగా ఢిల్లీ-చెన్నై క్వాలిఫయర్ ఫలితంపై ఇలానే కామెంట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
'ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది అభిమానులు అనవసర వ్యాఖ్యలు చేశారు. నిన్న చెన్నై గెలిచిన తర్వాత కూడా అలానే మాట్లాడారు. మీకు నచ్చిన టీమ్కు సపోర్ట్ చేయడం మంచిదే. కానీ ఇతర జట్ల విజయాన్ని కూడా గౌరవించాలి. వాళ్లు ఎలా ఆడారనే విషయం తెలుసుకోవాలి. అంతేకానీ ఈ చెత్త వ్యాఖ్యలు చేయవద్దు'అని పఠాన్ ఘాటుగా ట్వీట్ చేశాడు.
ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కెపె్టన్ ధోని (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు.