దాదాను అసహ్యించుకునేవాడిని
మ్యాచ్ టాస్కి లేట్గా వస్తాడని అప్పట్లో సౌరవ్ గంగూలీపై ఓ అపవాదు ఉండేది. ఇదే విషయాన్ని నాజర్ హుస్సేన్ కూడా ఇటీవలే చెప్పాడు. ‘గంగూలీతో ఆడుతునప్పుడల్లా అతన్ని అసహ్యించుకునేవాడిని. ఎందుకంటే టాస్కు వెళ్లిన ప్రతీసారి అతను నన్ను వెయిట్ చేయించేవాడు. టైమ్ అయిపోయింది మనం టాస్ వేయాలని నేను చెప్పాల్సి వచ్చేది' అని హుస్సేన్ అన్నాడు. అయితే కెప్టెన్లను వెయిట్ చేయించాలనే ఉద్దేశం దాదాకు లేదని, టైమ్ చూసుకుని టాస్కి వెళ్లేవాడని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా తెలిపాడు.
టైమ్ చూసుకుని టాస్కి వెళ్లేవాడు
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'అది నాకు మొదటి ఆస్ట్రేలియా పర్యటన. ఓ ఘటన ఇప్పటికి గుర్తుంది. ఆ సిరీస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వాని టాస్ కోసం సౌరవ్ గంగూలీ వెయిట్ చేయించాడు. ఆరోజు నేను డ్రెస్సింగ్ రూంలోనే ఉన్నాను. దాదా అక్కడే కూర్చుని అప్పుడప్పుడు టైమ్ చూస్తున్నాడు. చివరగా జట్టు మేనేజర్ వచ్చి.. సౌరవ్ టాస్కి టైమ్ అయ్యింది అని చెప్పాడు. ఆ వెంటనే దాదా మైదానంలోకి వెళ్లాడు. స్టీవ్ వా అప్పటికే చిరాకుతో ఉన్నాడు' అని తెలిపాడు.
ముఖంలో కంగారు కనిపించేది కాదు
'ఆ తర్వాత సిడ్నీ టెస్టులో మాత్రం టాస్ టైమ్ని సచిన్ టెండూల్కర్ గుర్తు చేశాడు. టాస్ టైం అవుతుందని చెప్పగానే దాదా వెంటనే మైదానంలోకి వెళ్లేవాడు. సాధారణంగా టాస్ సమయంలో లేట్ అయితే ఎవరిలోనైనా కంగారు, హడావుడి కనిపిస్తుంది. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం లేట్ అయినా ఎప్పుడూ ఆ కంగారు అతని ముఖంలో కనిపించేది కాదు' అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంట్రీ చెప్పడానికి కూడా దాదా ఆలస్యంగానే వచ్చేవాడు. అంతర్జాతీయ కెరీర్లో దాదా 113 టెస్టుల్లో, 311 వన్డే మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
రివర్స్ స్వింగ్ గురించి మర్చిపోవాల్సిందే:
రివర్స్ స్వింగ్ గురించి మర్చిపోవాల్సిందే:
ప్రపంచమంతా కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ రివర్స్ స్వింగ్ గురించి మర్చిపోవాల్సిందేనని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఉమ్మి (సలైవా) లేకుండా సాగిన బౌలింగ్ శైలిపై పఠాన్ మాట్లాడాడు. 'ఐదో రోజు ఆటలో ఆర్చర్, వుడ్ బౌలింగ్ చేసిన తీరు చూస్తే అర్థమవుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ఉమ్మి పూయకుండా బంతి నుంచి స్వింగ్ రాబట్టేందుకు వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది' అని పఠాన్ అన్నాడు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐసీసీ కొత్త నియమాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.