టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. టీమిండియా తరఫున ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసే సామర్థ్యం నితీష్ కుమార్ రెడ్డికి ఉందని అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 40 ప్లస్ రన్స్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ తెలుగోడు.. మెల్బోర్న్ టెస్ట్లో ఏకంగా(114) శతకంతో సత్తా చాటాడు. అసాధారణ బ్యాటింగ్తో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గానూ నిలిచాడు.

ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. బౌలింగ్ను మెరుగుపర్చుకుంటే టీమిండియా మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా అద్భుతమైన అవకాశం దొరికింది. ఏ బ్యాటర్కైనా ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేయడం అంత సులువు కాదు.
మనం అతని సెంచరీ గురించి మాట్లాడుతున్నాం. కానీ అంత కన్నా ముందు అతడి బ్యాటింగ్ తీరు గురించి మాట్లాడాలి. అతను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. క్రమం తప్పకుండా 40 పరుగుల మార్కును అందుకున్నాడు. అతను సెంచరీ బాదినప్పుడు మనమంతా నెం.8 లేదా నెం.9వ స్థానం కాకుండా నెం.6వ స్థానంలో బ్యాటింగ్ చేయగల ప్లేయర్ దొరికాడని భావించాం. ఆ స్థానంలో రాణించే సత్తా అతనికి ఉంది. ఈ స్థానంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా కాంబినేషన్ సమస్యకు పరిష్కారం లభించినట్లే. అతని ఆ సామర్థ్యం ఉంది.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. మొత్తంగా ఐదు మ్యాచుల్లో 298 పరుగులు చేశాడు. దీనిపై ఇర్ఫాన్ మాట్లాడుతూ.. "అతను సెంచరీ తర్వాత తన మూడు ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ, ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తంగా అతనే మంచి ప్రదర్శన చేశాడని చెప్పుకుంటున్నాం. అతను ఇలానే బౌలింగ్ లోనూ దృష్టి సారిస్తే కచ్చితంగా టీమ్ ఇండియాలో కీలకమైన, సమర్థవంతమైన ఐదో బౌలర్గా ఎదుగుతాడు. ముఖ్యంగా ఓవర్సీస్ పిచ్ లపై కీలకమైన బౌలర్ గా నిలుస్తాడు.'అని పఠాన్ పేర్కొన్నాడు.
ఇక ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3తో ఆసీస్కు కోల్పోయింది. పేలవ బ్యాటింగ్, సాధారణ బౌలింగ్ (బుమ్రాను మినహాయిస్తే)తో, అతి కష్టంగా పర్యటనను పరాభవంతో ముగించింది. ఆఖరి టెస్టులోనూ భంగపడ్డ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయి నిరాశగా ఇంటిముఖం పట్టింది.