IPL 2024 సీజన్ మినీ వేలానికి రంగం సిద్దమైంది. ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలాన్ని నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. రిటెన్షన్ ప్రక్రియ కూడా ముగియగా.. ఆటగాళ్ల ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12న తెరపడనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను రిటైన్ చేసుకొని భారంగా మారిన ప్లేయర్లను వేలంలోకి వదిలేసాయి.
వేలం కోసం తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ మినీ వేలాన్ని ఉద్దేశించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రచిన్ రవీంద్ర కోసం సన్రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉందన్నాడు.

'వికెట్లను తీయగల సత్తా ఉన్న స్పిన్నర్తో పాటు బ్యాటింగ్లో రాణించగలిగే ఆటగాడి కొరత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉంది. గత సీజన్లో ఆదిల్ రషీద్ను తీసుకున్నప్పటికీ.. అతను ఆ సమస్యను తీర్చలేకపోయాడు. దాంతో అతన్ని వదులుకుంది. జట్టులో ఇప్పటికే మయాంక్ మార్కండే ఉన్నాడు. కానీ అతని కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగలిగిన స్పిన్నర్ సన్రైజర్స్కు అవసరం.
వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్ రూపంలో ఆల్రౌండర్లు ఉన్నా రచిన్ను తీసుకుంటే ఆ విభాగం మరింత బలోపేతం కావడం ఖాయం. అలాగే ఓపెనర్గా రచిన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఒకవైపు దూకుడుగా ఆడే బ్యాటరే కానీ.. రెండో ఓపెనర్తో పాటు బ్యాకప్గా సన్రైజర్స్కు సరైన ప్లేయర్ లేడనే చెప్పాలి. ఈ సమస్యలన్నింటీని సన్రైజర్స్ రచిన్ రవీంద్రతో తీర్చుకోవాలని భావిస్తోంది. అతని కోసం తీవ్రంగా పోటీ పడనుంది.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గత మూడేళ్లు దారుణంగా విఫలమైంది. కెప్టెన్లను మార్చినా.. కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దాంతో ఈ సారి జట్టులో సమూల మార్పులు చేయడంపై సన్రైజర్స్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హెడ్ కోచ్ పదవి నుంచి బ్రియాన్ లారాను తప్పించింది. ప్రస్తుతం సన్రైజర్స్ పర్స్లో రూ. 34 కోట్లు ఉన్నాయి. కీలక ఆటగాళ్లను తీసుకొని జట్టును బలోపేతం చేసేందుకు సన్రైజర్స్ సిద్దమవుతోంది.