న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటగాళ్లను అర్థం చేసుకోని వారికి అండగా నిలిచే విషయంలో దాదాకు సాటిలేరని కొనియాడాడు. సహచర ఆటగాళ్లపై గంగూలీకి అపారమైన నమ్మకం ఉండేదని, జట్టు కోసం అనుక్షణం పరితపించేవాడన్నాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'భారత క్రికెట్ జట్టుకు సరైన నాయకుడు ఎప్పటికీ గంగూలీనే. ఎప్పుడూ జట్టును పటిష్ఠపరచాలనే ఆలోచించేవాడు. యువరాజ్ సింగ్ కెరీర్ ప్రారంభంలో తడబడినప్పుడు అతనికి దాదా అండగా నిలిచాడు. అది నాకింకా గుర్తుంది. ఆటగాళ్లలోని ప్రతిభను ముందుగా గుర్తించడంలో గంగూలీకి సాటిలేరు. కొంత ప్రోత్సాహం ఇస్తే అద్భుతంగా ఆడగల ఆటగాళ్లను గుర్తించి వారికి జట్టులో స్థానం కల్పించేవాడు.
విశేషం ఏంటంటే గంగూలీ అలా తీసుకున్న ఆటగాళ్లందరూ అతడి అంచనాలకు కచ్చితంగా అందుకున్నారు. అనతికాలంలోనే జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లుగా మారారు. ప్రస్తుతం భారత అభిమానుల గుండెల్లే వారికంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
యువరాజ్ ఒక్కడే కాదు.. హర్భజన్, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లందరిని ప్రోత్సహించాడు. క్లిష్ట స్థితి నుంచి భారత జట్టును పటిష్టం చేశాడు. దేశంలో క్రికెట్ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్న పరిస్థితుల నుంచి ఆధారించేలా చేశాడు. అందుకే గంగూలీనే భారత బెస్ట్ కెప్టెన్ అంటాను. అతను ఆటగాళ్ల నాయకుడు. భారత జట్టును ముందుకు తీసుకెళ్లడమే ఎజెండగా కృషి చేశాడు'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.