ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను వారి సొంతగడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ విజయాలను దక్కించుకున్న టీమిండియాకు సౌతాఫ్రికా గడ్డపై మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, ద్రవిడ్, గంగూలీ, ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాలకు సైతం సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం దక్కలేదు.
ఈ సారైనా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు టెస్ట్ల సిరీస్ గెలిచి ఈ లోటు తీర్చితే.. సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన ఆసియా జట్టుగా భారత్ చరిత్రకెక్కుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలోనే ఉన్న టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.

ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20 మంగళవారం జరగనుంది. ఈ పరిమిత సిరీస్లు ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్గా రోహిత్కు ఇది సువర్ణవకాశం అని చెప్పాడు.
'రోహిత్ శర్మ సౌతాఫ్రికాను ఓడించగలిగితే కెప్టెన్గా.. ప్లేయర్గా అతని పేరు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడుతోంది. ఈ రెండు మ్యాచ్లు గెలవడం అతనితో పాటు టీమిండియాకు చాలా కీలకం. రోహిత్ శర్మ ఓపెనర్, కెప్టెన్ కూడా. ఓపెనర్లు ఒకవేళ కొత్త బంతితో ఆడితే దూకుడు చూపించాలి. అప్పుడే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటానికి అవకాశం ఉంటుంది.
రోహిత్ శర్మ గతంలో ఇంగ్లండ్ పర్యటనకు బాగా సన్నదమై వెళ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అతను అదేవిధంగా సన్నదమయ్యాడని భావిస్తున్నా. కొత్త బంతితో ఆడుతూ పరుగులు రాబట్టడం, జట్టును ముందుకు నడిపించడం కాస్త సవాల్తో కూడుకున్న పనే. ఈ జట్టులో మనకు ఇద్దరు బిగ్ బ్రదర్స్ రోహిత్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వారిద్దరిపైనే జట్టు చాలా వరకు ఆధారపడి ఉంది'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.