టీమిండియా కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మను తుది జట్టులో నుంచి తప్పించేవారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. బ్యాటర్గా రోహిత్ శర్మ విఫలమవుతుండటంతో టీమిండియా కాంబినేషన్ సెట్ అవ్వడం లేదన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.
వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు రోహిత్ శర్మ దూరం కాగా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. రెండో టెస్ట్కు అతను తిరిగి రాగా.. టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. మూడో టెస్ట్లో వర్షం కారణంగా ఓటమి తప్పించుకుంది. నాలుగో టెస్ట్లో చిత్తుగా ఓడింది. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.

గత 15 ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 10.93 సగటుతో పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అతని బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. కీలకమైన మెల్ బోర్న్ టెస్ట్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. దాంతో అతను రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక రోహిత్ తన కెరీర్పై ఏదొక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఇప్పటికే భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తాజాగా రోహిత్ శర్మ ఫామ్పై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేవలం కెప్టెన్ అనే కారణంతోనే రోహిత్ శర్మను తుది జట్టులో కొనసాగిస్తున్నారని తెలిపాడు.
'అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 20 వేల పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతను ఫామ్ను అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ కాబట్టే అతను జట్టులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోతే ఇప్పుడు ఆడకపోయి ఉండేవాడేమో. అతను లేకపోతే భారత్కు మంచి కాంబినేషన్తో కూడుకున్న తుది జట్టు ఉండేది.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, వన్ డౌన్లో శుభ్మన్ గిల్ వచ్చేవారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే రోహిత్ బ్యాటర్గా పరుగులు చేయలేకపోతున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.