న్యూఢిల్లీ: ప్రేక్షకుల్లేని ఐపీఎల్.. అతిథుల్లేని పెళ్లి లాంటిదేనని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఐపీఎల్ సమయంలో ప్రేక్షకులను అనుమతించకపోతే టోర్నీకి కళ ఉండదన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, సందడి లేకపోతే.. మైదానంలోని ఆటగాళ్లలోనూ ఉత్సాహం ఉండదని కొందరు అంటుండగా.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మరో మార్గం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి మార్చిలోనే ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని ఏప్రిల్ 15కి తొలుత వాయిదా వేసిన బీసీసీఐ.. గడువు తేదీలోపు పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేసేసింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని చూస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్కప్ వాయిదాపడితే ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించే ప్రతిపాదనపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ 'అతిథులు లేని పెళ్లి అసంపూర్తిగా కనిపిస్తుంది. అలానే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్ల్లో సందడి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిలు కూడా అతిథులు లేకుండానే జరుగుతున్నాయి. కొంతమంది కోర్టు మ్యారెజీలు కూడా చేసుకుంటున్నారు. కానీ ప్రేక్షకుల మధ్య జరిగే వాతావరణానికి వారు లేకుండా నిర్వహించే మ్యాచ్లకు చాలా తేడా ఉంటుంది. బ్యాట్స్మన్ సిక్స్, ఫోర్ కొట్టినప్పుడు వారు చేసే అల్లరి, అరుపులు మిస్సవుతాయి. అసలు ఆ మజానే ఉండదు. ఈ పరిస్థితుల్లో కూడా మైదానాల్లోకి మ్యాచ్లు చూసే అభిమానులు ఉన్నారు.'అని పఠాన్ తెలిపాడు.
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్కు అభిమానుల్ని ఎవరినీ స్టేడియంలోకి అనుమతించలేదు. దాంతో.. న్యూజిలాండ్ ఫీల్డర్ లూకీ ఫర్గూసన్.. సిక్స్గా వెళ్లిన బంతి కోసం స్టేడియం స్టాండ్స్లో కాసేపు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కెప్టెన్గా కోహ్లీ సాధించిందేమీ లేదు: గంభీర్