
నాలుగు సూత్రాలు..
భారత క్రికెట్ రూపురేఖలు మార్చేందుకు పఠాన్ నాలుగు సూత్రాలు పాటించాలని చెప్పాడు. 'భారత్ క్రికెట్ ముందుకెళ్లాలంటే.. 1) ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడగలగాలి. అందులో కనీసం ఒక్కరైనా ఫ్రీగా బ్యాటింగ్ చేయాలి. 2) మణికట్టు స్పిన్నర్ జట్టులో తప్పకుండా ఉండాలి. అతడు తప్పకుండా వికెట్ టేకర్ అయిఉండాలి. 3) గాయపడని ఫాస్ట్ బౌలర్ భారత జట్టుకు చాలా అవసరం. 4) మరో ముఖ్యవిషయం ఏంటంటే కెప్టెన్లను మారిస్తే కప్పులు రావు. సారథులను మార్చినంత మాత్రానా ఫలితాలు మారవు. ఆడే విధానంలో మార్పులు రావాలి..'అని ట్వీట్ చేశాడు.

బ్యాకప్ కెప్టెన్ ఉండాలి..
అంతకుముందు టీమిండియా సారథిగా హార్ధిక్ పాండ్యాను నియమించాలన్న డిమాండ్ పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. బ్యాకప్ కెప్టెన్ను కూడా సిద్దం చేసుకోవాలని చెప్పాడు.'కెప్టెన్ను మారిస్తే ఫలితాలు మారవు. హార్ధిక్ పాండ్యాను సారథిగా నియమించాలని అంటున్నారు.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. అతడు కూడా గాయాలకు అతీతుడు కాదు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల ముందు జట్టు సారథి గాయపడితే ఎలా..? ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా సక్సెస్ అయ్యాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ లో ఒకడే కాకుండా గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉండాలి. బ్యాకప్ కెప్టెన్లను సిద్దం చేసుకోవాలి'అని తెలిపాడు.

మిషన్ 2024 స్టార్ట్..
వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024లో జరిగే తదుపరి టోర్నీకి రోడ్ మ్యాప్ స్టార్ట్ అయ్యిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లక్ష్యం దిశగా ముందుకెళ్లే కొద్దీ చాలా మంది ఆటగాళ్లకు సత్తా నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయని చెప్పాడు. ప్రపంచకప్ వైఫల్యం నుంచి జట్టు బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
'ప్రపంచకప్ ఫలితంతో జట్టులో నిరాశ ఉన్న విషయం తెలుసు. కానీ మేమంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లం. విజయాలను ఎలా ఆస్వాదిస్తామో.. వైఫల్యాన్ని అలాగే జీర్ణించుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. వచ్చే ప్రపంచకప్ దాదాపు రెండేళ్ల తర్వాత జరగనుంది.

ఆటను ఆస్వాదించడమే..
అప్పటిలోపు కొత్త ప్రతిభావంతులను వెలికితీయడానికి మాకు సమయం ఉంది. ఈ లోపు చాలా క్రికెట్ జరుగుతుంది. చాలా మందికి చాలినన్ని అవకాశాలు లభిస్తాయి. వచ్చే ప్రపంచకప్కు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇప్పుడే మొదలైంది. అయితే మాకు చాలా సమయం ఉంది. ఏం చేయాలన్నదానిపై కూర్చుని మాట్లాడతాం. ఇప్పుడైతే మా లక్ష్యం ఆటను ఆస్వాదించడమే. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం'' అని హార్దిక్ చెప్పాడు.
సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలు అందుకున్న యువ ఆటగాళ్లకు ఈ న్యూజిలాండ్ సిరీస్ చాలా కీలకమని హార్దిక్ తెలిపాడు. 'మా ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా పలువురు టాలెంటెడ్ ప్లేయర్లు బరిలో నిలిచారు. కొత్త శక్తి, ఉత్సాహంతో కూడిన కుర్రాళ్లతో కలిసి ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నా.'అని తెలిపాడు.


Click it and Unblock the Notifications












