
ముంబై: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందన్నాడు. అతని సారథ్యం ఒకప్పటి గౌతమ్ గంభీర్ను తలపిస్తోందని, ఈ సారి టైటిల్ ఆ జట్టుదేనని జోస్యం చెప్పాడు. పంజాబ్ కింగ్స్పై కేకేఆర్ విజయం సాధించిన అనంతరం హిందూస్తాన్ టైమ్స్తో మాట్లాడిన పఠాన్.. శ్రేయస్ సారథ్యంలోని కేకేఆర్కు తిరుగులేదన్నాడు.
'శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. 2018 సీజన్లో ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పడు అతనికి అంత అనుభవం లేదు. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కు కావల్సిన అనుభవం రావడంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన వ్యూహాలను రచించాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఉమేష్ యాదవ్ తొలి వికెట్ అందించిన తర్వాత.. శివం మావి చేతికి అయ్యర్ బంతి ఇచ్చాడు.

అయితే మావి భారీగా పరుగులు సమర్పించకున్నప్పటికీ.. దూకుడుగా ఆడుతున్న రాజపక్స వికెట్ సాధించాడు. అనంతరం వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ చేయించి పంజాబ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక్కడే మనం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్ను అర్థం చేసుకోవచ్చు. అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ జట్టును ఓడించడం ఇతర జట్టులకు అంత సులభం కాదు. కేకెఆర్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ తర్వాత, శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు కచ్చితంగా టైటిల్ నెగ్గుతుంది" అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఐపీఎల్-2022 సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్రైడర్స్ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను ఆరంభంలోనే ఓడించిన కేకేఆర్.. ఆర్సీబీ చేతిలో ఖంగుతిన్నది.ఆ తర్వాత పంజాబ్పై పంజా విసిరింది. తదుపరి మ్చాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. బుధవారం పుణే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.