టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే తన కెరీర్ నాశనమైందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. మెరుగైన ప్రదర్శన చేసినా జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు. జట్టులో ప్రధాన పేసర్గా.. పేస్ ఆల్రౌండర్గా వెలుగొందిన ఇర్ఫాన్ పఠాన్ 2009లో ఉన్నట్టుండి జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరఫున చివరి మ్యాచ్ను ఇర్ఫాన్ పఠాన్ 2012 అక్టోబర్లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయిన అతను.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. ధోనీ కారణంగానే భారత జట్టులో చోటు దక్కలేదని అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టెన్ పరోక్షంగా చెప్పాడని తెలిపాడు. కెప్టెన్గా తుది జట్టును ఎంచుకునే హక్కు ధోనీకి ఉందని, అతన్ని తాను తప్పుబట్టడం లేదని స్పష్టం చేశాడు.

'శ్రీలంకతో జరిగిన సిరీస్లో నా అన్న యూసఫ్ పఠాన్తో కలిసి నేను అద్భుతమైన విజయాన్ని అందించా. కేవలం 27-28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన తర్వాత కూడా నన్ను ఏడాది పాటు పక్కనపెట్టారు. ఆ సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
ఈ విషయం గురించి నేను అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టెన్ను అడిగాను. నన్ను పక్కనపెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్నించాను. కిర్స్టెన్ నాకు రెండు కారణాలు చెప్పారు. కొన్ని విషయాలు తన చేతుల్లో లేవని చెప్పిన ఆయన.. తుది జట్టు ఎంపిక తుది నిర్ణయం కెప్టెన్దే అని వెల్లడించాడు. అప్పుడు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు.
రెండో కారణంగా.. ఏడో స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలని జట్టు భావిస్తుందని తెలిపాడు. నా సోదరుడు యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్రౌండర్. నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు. తుది జట్టు ఎంపికలో కెప్టెన్దే తుది నిర్ణయం. ఇక ధోనీ తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా? నేను చెప్పాలనుకోవడం లేదు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.