
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28న ఆరంభమయ్యే ఈ లీగ్ ఆడేదుకు పఠాన్ లీగ్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లీగ్లో పాల్గొనే ఐదు జట్లలో ఏదో ఒక జట్టు అతడిని 'మార్కీ ప్లేయర్ (స్టార్ ఆటగాడు)' జాబితాలో తీసుకునే అవకాశం ఉంది.
పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో... విదేశీ లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. భారత జట్టుకు ఆడే ఆటగాళ్లను విదేశీ టీ20 లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు.
అయితే తాను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తనకెటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండదని పఠాన్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2007 టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.