పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఆ దేశ మీడియాపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పేరుతో బతుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసియాకప్ 2025 టోర్నీలో భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో వివాదం నెలకొంటే.. సోషల్ మీడియాలో అఫ్రిదిX ఇర్ఫాన్ పఠాన్ గొడవపడుతున్నారు.
గత నెలలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్.. షాహిద్ అఫ్రిదిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతనితో తనకు అస్సలు పడేది కాదని, మాటల యుద్దం జరిగేదని గుర్తు చేసుకున్నాడు. అనవసరంగా తనతో గొడవకు దిగిన అఫ్రిది నోరు ఎలా మూయించాననే విషయాన్ని కూడా పఠాన్ వెల్లడించాడు.
'2006 పాకిస్థాన్ పర్యటనలో భాగంగా మేం కరాచీ నుంచి లాహోర్కు విమానంలో ప్రయాణిస్తున్నాం. మాతో పాటు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. షాహిద్ అఫ్రిది నా దగ్గరికి వచ్చి నా జుట్టును చిందరవందర చేసి..'హాయ్ కిడ్.. ఎలా ఉన్నావ్?' అని అడిగాడు. అతని ప్రవర్తన నాకు తీవ్ర కోపం తెప్పించింది. నేను వెంటనే నువ్వు ఎప్పటి నుంచి నాకు తండ్రివి అయ్యావు అని అడిగాను. నిజానికి అతనే పిల్లచేష్టలతో నాకు కోపం తెప్పించాడు.అతను నాకు స్నేహితుడు కాదు. అయినా నా జట్టును చిందరవందర చేశాడు. నా మాటలకు సీరియస్ అయిన అఫ్రిది కొన్ని తిట్లు తిట్టాడు. నా సీటు పక్కనే అతని సీటు కూడా ఉంది. మరోవైపు నా పక్కన అబ్దుల్ రజాక్ కూర్చున్నాడు.

నేను వెంటనే అతనితో ఇక్కడ ఏ రకమైన మాంసం దొరుకుతుందని అడిగాను. రజాక్ షాక్ అయి.. 'ఏయ్ ఇర్ఫాన్, నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావ్?' అని అన్నాడు. నేను.. వెంటనే అతను (అఫ్రిది) కుక్క మాంసం తిన్నట్లున్నాడు. చాలా సేపటి నుంచి మొరుగుతూనే ఉన్నాడని చెప్పాను.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
తాజాగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి ఓ టీవీ షోలో మాట్లాడిన షాహిద్ అఫ్రిది.. ఇర్ఫాన్ పఠాన్ కుక్క మాంసం వ్యాఖ్యలపై స్పందించాడు. అలాంటి ఘటనే జరగలేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఫేస్ టూ ఫేస్ మాట్లాడాలని తెలిపాడు.
"నాతో సూటిగా మాట్లాడే వ్యక్తిని నేను నిజమైన మనిషిగా భావిస్తాను. నా వెనుక చాలా చర్చలు జరుగుతాయి. అతను నా ముఖం మీద మాట్లాడితేనే నేను అతనికి సమాధానం చెప్పగలను. అతని అబద్దాలకు నేను ఎలా సమాధానం చెప్పగలను'అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
ఈ కామెంట్స్పై స్పందించిన ఇర్పాన్ పఠాన్.. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, మీడియా తన పేరు చెప్పుకొని బతుకుతున్నాయని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చాడు. 'మీరు చెప్పింది నిజమే. పొరుగు దేశం మాజీ ఆటగాళ్లు, మీడియా ఇర్ఫాన్ పఠాన్ పేరుతో ప్రజాదరణ పొందుతున్నాయి.'అని ట్వీట్ చేశాడు.