
మెరుగైన రికార్డ్ లేదు
నిజానికి విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో మెరుగైన రికార్డ్ లేదు. 2014లో అక్కడికి టూర్కి వెళ్లిన కోహ్లీ.. ఐదు టెస్టులాడి పూర్తిగా విఫలమయ్యాడు. 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులతో నిరాశపరిచాడు. సిరీస్ మొత్తం ఇంగ్లీష్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో తడబడ్డాడు. తాజాగా మరోసారి ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లిన టీమిండియా అక్కడ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. దాంతో ఈసారి కూడా భారత కెప్టెన్ కోహ్లీపై అండర్సన్ ఆధిపత్యం చెలాయిస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇప్పటికీ తడబడుతున్నాడు
ఇర్ఫాన్ పఠాన్ ప్లేఫీల్డ్ మ్యాగజైన్కు రాసిన తాజా కాలమ్లో విరాట్ కోహ్లీపై స్పందించాడు. 'ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ గురించి విరాట్ కోహ్లీ ఎప్పుడూ కంగారుపడలేదు. ఎందుకంటే అతను ఒక లైన్పై బౌలింగ్ చేస్తాడు. కానీ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో ఇప్పటికీ కోహ్లీ తడబడుతుంటాడు. కోహ్లీనే కాదు ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా అతడి బౌలింగ్లో సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేడు. దానికి కారణం అతని స్వింగ్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. బంతి మూవ్ అవుతూ వస్తున్నప్పుడు అంచనా వేయడం కష్టం. బంతిని స్వింగ్ చేయడం ఓ గొప్ప కల' అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
RCBian Mr.Nags: ఓ ఇంటివాడైన ఆర్సీబీ ఫన్నీమాన్ డానిష్ సైత్ 'మిస్టర్ నాగ్స్'...వైరల్ ఫొటోస్..!!

వేగం మాత్రమే ఉంటే సరిపోదు
'పాట్ కమిన్స్, జోఫ్రా ఆర్చర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. అయితే వారి బౌలింగ్లలో రిషబ్ పంత్ మరియు జోస్ బట్లర్ బాగా ఆడతారు. ల్యాప్ షాట్లు మరియు రివర్స్ స్వీప్లు ఆడటం మనం చూసాం. వేగం మాత్రమే ఉంటే సరిపోదు. ఎందుకంటే పేస్కి ఏ బ్యాట్స్మన్ కూడా భయపడడు. వేగంతో మాత్రమే వేస్తే.. బ్యాట్స్మన్ బంతిని మైదానం బయటకు బాదుతాడు. అందుకే నైపుణ్యం కూడా కావాలి. స్వింగ్ గొప్ప నైపుణ్యం అని నేను నమ్ముతా' అని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇర్ఫాన్ 29 టెస్టుల్లో, 120 వన్డేల్లో, 24 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

2018లో ఇరగదీశాడు
2014లో జేమ్స్ అండర్సన్ స్వింగ్ బంతుల్ని ఆడటంలో తడబడిన విరాట్ కోహ్లీ.. అదే ఏడాది ఆస్ట్రేలియా టూర్లో మిచెల్ జాన్సన్ బౌలింగ్ని ఉతికారేశాడు. ఒకే సిరీస్లో నాలుగు టెస్టు సెంచరీలను నమోదు చేశాడు. ఇక 2014లో తన తప్పుల నుంచి పాఠాలను నేర్చుకున్న కోహ్లీ 2018లో ఇరగదీశాడు. ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు. 10 ఇన్నింగ్స్లలో 593 పరుగులు చేశాడు. అయితే 2019 నవంబరు నుంచి కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












