ఐపీఎల్ 2025 సీజన్ కామెంట్రీ ప్యానెల్ నుంచి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ను బీసీసీఐ తొలగించింది. ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవార్కర్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తక్కువ చేసేలా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. రోహిత్ సగటు 6 పరుగులు మాత్రమేనని, తుది జట్టులో చోటుకు అతను అనర్హుడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. రోహిత్ శర్మ ఆట పట్ల తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తెలిపాడు. బాగా ఆడలేనప్పుడు విమర్శలు గుప్పించడమే కామెంటేటర్ బాధ్యత అని చెప్పాడు.

'నా అభిప్రాయం ప్రకారం కళ్లకు కనిపించిన విషయాలు చెప్పడమే వ్యాఖ్యాతల పని. ఏం జరుగుతుంది? ఎందుకు? ఎలా జరుగుతుంది? ఏం జరగవచ్చు? ఎలా జరగవచ్చు? అనే విషయాలు ప్రేక్షకులకు చెప్పడం కామెంటేటర్స్ పని. ఒక ఆటగాడు బాగా ఆడితే.. అతన్ని ప్రశంసించాలి. బాగా ఆడకపోతే విమర్శించాలి. కామెంటేటర్కు ఆటగాడి పట్ల కాకుండా అభిమానుల పట్ల బాధ్యత ఉంటుంది.
రోహిత్ శర్మ అద్భుతమైన వైట్ బాల్ ప్లేయర్. కానీ ఆ ఏడాది రెడ్ బాల్ క్రికెట్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. అతని సగటు 6 పరుగులు మాత్రమే. అందుకే నేను రోహిత్ కెప్టెన్ కాకపోయి ఉంటే.. అతనికి తుది జట్టులో చోటు దక్కేది కాదని చెప్పాను.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ సొంతంగా తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేసిన ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. దాంతో పఠాన్పై విమర్శలు వచ్చాయి. కామెంట్రీలో తిట్టి మళ్లీ పొగుతున్నాడని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ ఘటనపై కూడా పఠాన్ స్పందించాడు.
'ఇంటర్వ్యూ సందర్భంగా రోహిత్ శర్మను బాగా పొగిడామని జనాలు అంటున్నారు. కానీ వాస్తవానికి, బ్రాడ్కాస్టింగ్ ఛానెల్కు ఎవరు వచ్చినా.. వారిని అతిథులుగానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రోహిత్ కూడా మా అతిథి. అందుకే అతన్ని నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసించాం. అతని జట్టులో చోటు దక్కదని విమర్శించింది కూడా మేమే. కానీ ఈ ఇంటర్వ్యూ ఎక్కువ చర్చనీయాంశమైంది.'అని పఠాన్ స్పష్టం చేశాడు.