టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసం మాజీ క్రికెటర్లు ఇర్పాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ గొడవపడ్డారు. కెమెరాల ముందే వాగ్వాదానికి దిగారు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్కు ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు.
రెండో రోజు ఆట అనంతరం యశస్వి జైస్వాల్ రనౌట్ గురించి మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. విరాట్ కోహ్లీని తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రన్ తీయాల్సిందని, స్కూల్ ఎర్రర్ అంటూ విమర్శలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలను ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టాడు. వెంటనే ఇర్ఫాన్ పఠాన్.. ఈ రనౌట్ విషయంలో కోహ్లీది ఎలాంటి తప్పిదం లేదని సంజయ్ మంజ్రేకర్కు కౌంటరిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన హీటెక్కింది.

అసలేం జరిగిందంటే..?
విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 82) రెండో వికెట్కు 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేసింది. అయితే సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్.. అనసవర పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
భారత తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన 41వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బౌండరీ తరలించిన యశస్వి జైస్వాల్.. మరుసటి బంతిని మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్కు ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి నేరుగా కమిన్స్ చేతులోకి వెళ్లడం గమనించిన కోహ్లీ.. సింగిల్ తీయకుండా యూటర్న్ తీసుకున్నాడు.
అప్పటికే నాన్స్ట్రైకర్ వైపు వచ్చిన యశస్వి జైస్వాల్ నిస్సాహాయుడిగా నిలబడిపోయాడు. బంతిని అందుకున్న కమిన్స్ బ్యాటింగ్ ఎండ్ వికెట్లవైపు కొట్టగా తాకలేదు. వెంటనే బంతిని అందుకున్న అలెక్స్ క్యారీ స్టంప్స్ను కిందపడేసాడు. దాంతో యశస్వి జైస్వాల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటి కోహ్లీ కూడా ఔటవ్వగా.. నైట్ వాచ్మన్గా వచ్చిన ఆకాశ్ దీప్ కూడా వెనుదిరిగాడు.
కోహ్లీదే తప్పు..
రెండో రోజు ఆట అనంతరం ఈ రనౌట్పై మాట్లాడుతూ సంజయ్ మంజ్రేకర్.. చిన్నపిల్లాడిలా కోహ్లీ తప్పిదం చేశాడని విమర్శలు గుప్పించాడు. 'మనం కోహ్లీ వైపు నుంచి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. ఇది స్కూల్ బాయ్ ఎర్రర్. అక్కడ పరుగు లేదని భావించి కోహ్లీ వెనక్కి తిరిగాడు. కానీ రన్ తీయాలా? వద్దా? అనేది నాన్స్ట్రైకర్ నిర్ణయం కాదు. ఒకవేళ యశస్వి జైస్వాల్దే తప్పిదం అయితే ప్యాట్ కమిన్స్ నాన్ స్ట్రైకర్ వైపు బంతిని విసిరేసి రనౌట్ చేసేవాడు. కానీ కోహ్లీ పరుగు తీయకపోవడంతో యశస్వి జైస్వాల్కు అవకాశం లేకుండా పోయింది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలను ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టాడు. ఫీల్డర్ చేతిలో బంతి పడినప్పుడు నాన్స్ట్రైకర్ కూడా పరుగుకు నిరాకరించవచ్చని తెలిపాడు. బంతి తన పక్క నుంచే వెళ్లడంతో ఆ వేగాన్ని పసిగట్టి కోహ్లీ పరుగుకు నిరాకరించాడని చెప్పాడు.
కోహ్లీని వెనకేసుకురావడం లేదు..
పఠాన్ అభిప్రాయంతో ఆగ్రహానికి గురైన సంజయ్ మంజ్రేకర్.. ఇక్కడ రనౌట్ గురించి మాట్లాడుతున్నామని తెలిపాడు. వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నానని, కోహ్లీని వెనకేసుకురావడం లేదన్నాడు. తొలి రోజు ఆటలో కోహ్లీ చేసిన తప్పిదం గురించి కూడా మాట్లాడనని గుర్తు చేశాడు.
ఆ వెంటనే సంజయ్ మంజ్రేకర్ తనను మాట్లాడినవ్వకూడదనుకుంటే సరే.. కానీ చెప్పిన ఉదహారణ సరిగ్గా లేదన్నాడు. దానికి ఇర్ఫాన్ పఠాన్.. కొన్నిసార్లు స్ట్రైకర్ కూడా నిర్ణయం తీసుకోవచ్చని, ఫీల్డర్ చేతిలో బంతి ఉండటం గమనించినప్పుడు ఎవ్వరైనా పరుగు వద్దని చెబుతారని తెలిపాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సంజయ్ మంజ్రేకర్.. రన్ తీయవచ్చా? లేదా? అనేది ఇర్ఫాన్ పఠాన్ కోచింగ్ మాన్యువల్లో చేర్చాలని ఎద్దేవా చేశాడు.
ఆసీస్ 474
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 82) శతకం చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(86 బంతుల్లో 4 ఫోర్లతో 36) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో రిషభ్ పంత్(6 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీసారు.
అంతకుముందు 311/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 140) భారీ శతకంతో చెలరేగగాడు.
Kalesh between Irfan and Sanjay Manjrekar 😭 pic.twitter.com/9Ucs6FU3pb
— Pallavi Anand (@PallaviSAnand) December 27, 2024