ప్రతిష్టాత్మక ఇరానీ కప్ 2024 టోర్నీలో బరిలోకి దిగే రెస్టాఫ్ ఇండియా జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను మంగళవారం వెల్లడించింది. రెస్టాఫ్ ఇండియా జట్టుకు రుతురాజ్ కెప్టెన్గా ఎంపికవ్వగా.. అభిమన్యు ఈశ్వరన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు సెలెక్ట్ అయిన ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ తుది జట్టులో చోటు దక్కించుకోకపోతే రెస్టా ఆఫ్ ఇండియా తరఫున ఇరానీ కప్ ఆడుతారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. సర్ఫరాజ్ ఖాన్ కూడా తుది జట్టుకు ఎంపికవ్వకపోతే ముంబై తరఫున బరిలోకి దిగుతాడని పేర్కొంది.

అక్టోబర్ 1 నుంచి 5 వరకు లక్నో వేదికగా రంజీ ట్రోఫీ 2024 ఛాంపియన్ ముంబైతో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ముంబై జట్టును వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే నడిపించనున్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా ఈ జట్టును ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి రికీ భుయ్ మాత్రమే రెస్టాఫ్ ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఇండియా ఏ తరఫున శతకంతో రాణించిన తిలక్ వర్మకు కూడా అవకాశం దక్కలేదు. దులీప్ ట్రోఫీలో పెద్దగా ప్రభావం చూపని నితీష్ కుమార్ రెడ్డిని కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు.
రెస్టాఫ్ ఇండియా జట్టులోకి సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారాను తీసుకుంటారని ప్రచారం జరిగినా.. అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇషాన్ కిషన్కు అవకాశం దక్కగా.. సంజూ శాంసన్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టుకు ఎంపికవ్వలేదు. దులీప్ ట్రోఫీలో సత్తా చాటిన అర్ష్దీప్ సింగ్ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నేపథ్యంలోనే సంజూ, సూర్య, అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మలను ఇరానీ కప్కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
రెస్టాఫ్ ఇండియా
రుతురాజ్(కెప్టెన్), అభిమన్యు ఈశ్వరణ్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(కీపర్), ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, సరాన్ష్, ప్రసిధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యశ్ దయాల్, రికీ భుయ్, శశ్వాత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్.