ప్రతిష్టాత్మక ఇరానీ కప్ 2024లో రెస్టాఫ్ ఇండియా పోరాడుతోంది. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్లో 74 ఓవర్లలో 4 వికెట్లకు 289 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్(212 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 151 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించాడు.
అతనికి తోడుగా క్రీజులో ధ్రువ్ జురెల్(30 బ్యాటింగ్) ఉన్నాడు. రెస్టాఫ్ ఇండియా ఇంకా 248 పరుగుల వెనుకంజలో ఉంది. ముంబై బౌలర్లలో మోహిత్ అవాస్థి(2/66) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ జునేద్ ఖాన్, తనుష్ కోటియన్ తలో వికెట్ తీసారు. 536/9 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ముంబై మరో మూడు ఓవర్లు మాత్రమే ఆడి ఒక పరుగు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్ను ముగించింది.

141 ఓవర్లలో 537 చేసింది. సర్ఫరాజ్ ఖాన్(286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్లతో 222 నాటౌట్) అజేయ ద్విశతకంతో రాణించగా.. అతనికి తనూష్ కోటియన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 64) అండగా నిలిచాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్(5/110) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. యశ్ దయాల్(2/89), ప్రసిధ్ కృష్ణ(2/102) రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైస్(1/82)కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా ఆదిలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(9) వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్(32)తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కీలక భాగస్వామ్యం అనంతరం సాయి సుదర్శన్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్(16) కూడా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అభిమన్యూ ఈశ్వరణ్ 117 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్(38) నిలకడగా ఆడినా భారీ స్కోర్ చేయలేకపోయాడు.