
గ్వాలియర్: ఇరానీ కప్ 2023ను రెస్టాఫ్ ఇండియా ఘనంగా ప్రారంభించింది. 2021-22 రంజీ ట్రోఫీ విజేత మధ్య ప్రదేశ్తో బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రెస్టాఫ్ ఆఫ్ ఇండియా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(259 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 213) డబుల్ సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగులు చేసింది. యశస్వీకి తోడుగా ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (240 బంతుల్లో 17 ఫోర్లు 2 సిక్స్లతో 154) సెంచరీతో సత్తా చాటాడు. మూడో వికెట్కు ఈ ఇద్దరూ 371 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ ఇద్దరూ వరుస బంతుల్లో ఔటవ్వడం విశేషం. ఇక మధ్య ప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(2)ను ఔట్ చేసి ఆవేశ్ ఖాన్ షాకిచ్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన జైస్వాల్తో అభిమన్యూ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కిన వాటిని బౌండరీలకు తరలించారు. ముందుగా ఈశ్వరన్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత జైస్వాల్ 81 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దాంతో రెస్టాఫ్ ఇండియా 123/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. అనంతరం ఇదే జోరు కనబర్చిన ఈ జోడీ.. మధ్య ప్రదేశ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఈ క్రమంలో ఈశ్వరన్ 135 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. రెస్టాఫ్ ఇండియా 200 పరుగుల మార్క్ను అందుకుంది. ఆ కొద్దిసేపటికే యశస్వీ సైతం 157 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. దాంతో రెస్టాఫ్ ఇండియా 224/1 స్కోర్తో రెండో సెషన్ను ముగించింది.
చివరి సెషన్లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధాటిగా ఆడుతూ.. 230 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ద్విశతకాన్ని అందుకున్న కాసేపటికే యశస్వీని ఆవేశ్ ఖాన్ బౌల్డ్ చేయగా.. మరుసటి బంతికే అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. క్రీజులో సౌరబ్ కుమార్(0 బ్యాటింగ్)తో పాటు బాబ ఇంద్రజీత్(3 బ్యాటింగ్) ఉన్నారు.