
గ్వాలియర్: దేశవాళీ క్రికెట్లో ముంబై యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇరానీ కప్లో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన యశస్వీ జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీతో చెలరేగాడు. 157 బంతుల్లో 16 ఫోర్లు 3 సిక్స్లతో 144 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
తొలి ఇన్నింగ్స్లో 259 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 213 పరుగులు చేసిన యశస్వీ సూపర్ ఫామ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన యశస్వీ 9 సెంచరీలతో పాటు 3 డబుల్ సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు బాదాడు. అతని యావరేజ్ 85గా ఉండటం గమనార్హం. యశస్వీపై మాజీ క్రికెటర్లతో అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రెండు ఇన్నింగ్స్లతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యశస్వీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో ఓ డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన 11 ప్లేయర్గా నిలిచాడు. ఇరానీ కప్లో సింగిల్ ఎడిషన్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ప్లేయర్గా.. 300 ప్లస్ పరుగులు చేసిన రెండో ప్లేయర్గా చరిత్రకెక్కాడు.
85/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా యశస్వీ సెంచరీతో 246 పరుగులు చేసింది. యశస్వీ మినహా మరే బ్యాటర్ రాణించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, అంకిత్, జైన్, శుభమ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. కుమార కార్తీకేయ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 437 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 81 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హిమాన్షు మంత్రి(51 బ్యాటింగ్), హర్ష్ గౌలి(15 బ్యాటింగ్) ఉన్నారు. రెస్టాఫ్ ఇండియా విజయానికి 8 వికెట్లు అవసరం కాగా.. ఓటమి తప్పించుకోవాలంటే మధ్యప్రదేశ్ చివరి రోజు మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో యశస్వీ డబుల్ సెంచరీతో 484 పరుగులు చేసింది. అనంతరం మధ్యప్రదేశ్ 294 పరుగులకు కుప్పకూలింది. యశ్ దుబే(109) సెంచరీ చేయగా.. శుభ్మన్ శర్మ(54), జైన్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో రెస్టాఫ్ ఇండియాకు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.