IPL vs PSL 2024 Salary: ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికారు. దుబాయ్ వేదికగా గత మంగళవారం జరిగిన వేలంలో ఈ ఆసీస్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ. 24.75 కోట్ల భారీ ధరకు మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేయగా.. రూ. 20.50 కోట్లకు ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ తీసుకుంది.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా ఈ ఇద్దరూ చరిత్రకెక్కారు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు భారీ ధర చెల్లించడం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఓవర్సీస్ ఆటగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, మెగా వేలంలో పాల్గొనకుండా.. మినీ వేలంలో పాల్గొంటూ భారీ సొమ్మును క్యాష్ చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే ఈ ఇద్దరు ఎక్కువనా? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే కొందరు అభిమానులు మాత్రం ఐపీఎల్ 2024 ఆటగాళ్ల జీతాలను పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్లేయర్ల సాలరీలతో పోల్చుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్గా ఐపీఎల్ గుర్తింపు పొందడంతో.. పీసీబీ కూడా ఐపీఎల్ తరహాలోనే పీఎస్ఎల్ రూపొందించింది.
ఈ లీగ్లో కూడా విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే ఐపీఎల్ తరహాలో ఈ టోర్నీ సక్సెస్ కాలేకపోయింది. కానీ పీసీబీ మాత్రం ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్పదని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఇరు లీగ్ల ఆటగాళ్ల జీతాలను పోల్చుతూ పోస్ట్లు పెడుతున్నారు.
ఐపీఎల్లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ జీతం రూ. 24.75 కోట్లతో పీఎస్ఎల్లో ఓ జట్టును కొనవచ్చని కామెంట్ చేస్తున్నారు. స్టార్క్ ఒక్క మ్యాచ్కు రూ. 1.70 కోట్లు తీసుకుంటుండగా.. పీఎస్ఎల్ సీజన్ మొత్తానికి బాబార్ ఆజామ్ రూ. 1.40 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ సాలరీ రూ. 15 కోట్లు ఉండగా.. షాహిన్ షా అఫ్రిది సాలరీ లక్షా 70 వేల అమెరికా డాలర్లు మాత్రమే ఉంది.