Saudi Arabia crown prince eyes IPL: ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై సౌదీ యువరాజ్ కన్నుపడింది. కనకవర్షం కురిపిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్లో భాగమయ్యేందుకు సౌదీ యువరాజ్ ప్రయత్నిస్తున్నట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. ఐపీఎల్లో రూ.41500 కోట్ల పెట్టు బడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడని ఓ కథనాన్ని ప్రచురించింది.
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ను 30 బిలియర్ డాలర్లు విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చాలని సౌదీ అరేబియా యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు భారత ప్రభుత్వ ప్రతినిధులకు సూచించినట్లు ఆ కథనంలో పేర్కొంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయం తెలిసిందని రాసుకొచ్చింది. సెప్టెంబర్లో సౌదీ అరేబియా యువరాజ్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసిట్లు పేర్కొంది. ఈ హోల్డింగ్ కంపెనీలో సౌదీ యువరాజ్ 5 బిలియన్ డాలర్లు అంటే రూ.41500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయని బ్లూమ్బెర్గ్ వార్త సంస్థ ప్రస్తావించింది.
ఇలా చేయడం ద్వారా ఐపీఎల్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వీలు ఉంటుందని సౌదీ యువరాజ్ సూచించాడని తెలిపింది.
సౌదీ యువరాజ్ చేసిన ప్రతిపాదనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీసీసీఐతో పాటు సౌదీ అరేబియా అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐపీఎల్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లు వచ్చినా.. ఆ స్థాయి ఆదరణను అందుకోలేకపోయాయి. ఇక ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం టీవీ చానెళ్లు, ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. దీంతో ఐపీఎల్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో, సౌదీ టూరిజం డిపార్ట్మెంట్ ఐపీఎల్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 12న నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 15లోపు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను వెల్లడించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై బీసీసీఐ ఫోకస్ పెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్ను స్వదేశంలోనే జరపాలా? లేక విదేశాల్లో నిర్వహించాలా? అనే విషయాన్ని బీసీసీఐ తేల్చుకోవాల్సి ఉంది.