ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు భిన్నంగా జాక్పాట్ కొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ సారథి రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించింది. ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్కు పంట పండింది. తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని కేకేఆర్ రూ.23.75 కోట్లు కుమ్మరించింది.
అయితే అనూహ్యంగా కొందరు ఆటగాళ్లు తక్కువ ధరకు అమ్ముడుపోయారు. వాళ్ల స్టార్డమ్తో పోలిస్తే దక్కిన మొత్తం తక్కువే. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ టాప్లో ఉన్నాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన రాహుల్ కనీసం రూ.20 కోట్లు పలుకుతాడని అంచనా వేశారంతా. కానీ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకే దక్కించుకుంది. రాహుల్ కోసం ఆర్సీబీ-కేకేఆర్ తొలుత పోటీపడ్డాయి. రూ.10 కోట్లు మార్క్ను అందుకోవడంతో బెంగళూరు, కేకేఆర్ ఫ్రాంచైజీలు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత సీఎస్కేతో ఢిల్లీ పోటీపడి అంతిమంగా దక్కించుకుంది.
ఐపీఎల్ వేలం 2025 LIVE: ముగిసిన తొలి రోజు వేలం.. 84 మంది ఆటగాళ్ల వేలం!

ఇక తమ వ్యూహాలతో సీఎస్కే ముగ్గురు ఆటగాళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్లు డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు)తో దక్కించుకోవడం మంచి బేరమే. భారత స్టార్ యువ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి ని రూ. 3.40 కోట్లకే తగ్గించుకోవడం విశేషం. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్ను లక్నో సూపర్ జెయింట్స్ కేవలం తన కనీస ధర రూ.2 కోట్లకే సొంతం చేసుకుంది. అలాగే అఫ్గానిస్థాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు)ను కేకేఆర్ తక్కువ ధరకు సొంతం చేసుకుంది.
కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఊహించిన మొత్తం లభించలేదు. గత వేలంలో రూ.24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకే దక్కించుకుంది. ఆల్రౌండర్లు మిచెల్ మార్ష్ను లక్నో రూ.3.40 కోట్లకు, గ్లెన్ మ్యాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లు, ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. మహ్మద్ షమిని ఎస్ఆర్హెచ్ రూ.10 కోట్లకే కొనుగోలు చేయడం కూడా చౌక బేరమే.
తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్టార్ ప్లేయర్ల జాబితా:
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్సీబీ)
కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
ఎయిడెన్ మార్క్రమ్-రూ. 2 కోట్లు(లక్నో)
డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్కే)
రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్కే)
రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్కే)
మిచెల్ మార్ష్- రూ. 3.4 కోట్లు(లక్నో)
గ్లేన్ మ్యాక్స్వెల్-రూ. 4.20 కోట్లు(పంజాబ్)
క్వింటన్ డికాక్-రూ. 3.60 కోట్లు(కేకేఆర్)
రెహ్మానుల్లా గుర్బాజ్- రూ. 2 కోట్లు(కేకేఆర్).