
రూ. 40 వేల కోట్లు టార్గెట్..
ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉండటం.. యాడ్స్ రూపంలో వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండటంతో ఈ ధనాధన్ లీగ్ మీడియా రైట్స్ కోసం ప్రముఖ మీడియా సంస్థలు ఆసక్తికనబరుస్తున్నాయి. దాంతోనే తీవ్ర పోటీ ఉండనుంది. ఈ సారి మీడియా హక్కుల ద్వారా రూ. 40 వేల కోట్లకు పైగా సంపాదిస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో పాల్గొన్న గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. రెండు ఫ్రాంచైజల అమ్మకం ద్వారానే రూ. 12,725 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు.. కీలకమైన మీడియా హక్కుల ద్వారా రూ. 40 వేల కోట్ల కంటే తక్కువ అయితే రాదు కదా? అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారీ ఆదాయంతో బీసీసీఐ ఖాజానా పెరిగిపోనున్నది. మీడియా రైట్స్ ద్వారా రూ. 40వేల కోట్లు వస్తే.. ఒక్క ఏడాదిలోనే బీసీసీఐ ఖాజానాలో మొత్తం 52 వేల కోట్లు చేరనున్నాయి.

ఆన్లైన్లో వేలం..
ఇక మీడియా రైట్స్ ఆదాయంలో నుంచి 50 శాతం సెంట్రల్ పూల్లోకి వెళ్తుంది. దీంట్లో ప్రతీ ఫ్రాంచైజీకి వాటా వస్తుంది. అలా ఫ్రాంచైజీల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ సారి ఐపీఎల్ హక్కుల కోసం ఈ-ఆక్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల హక్కులను ఇదే పద్దతిలో వేలం వేసి భారీగా ఆదాయం పొందింది. రెండు నెలల క్రితం మీడియా హక్కుల అంచనాలు కేవలం రూ. 25 వేల కోట్లుగా మాత్రమే ఉన్నది. అయితే రెండు ఫ్రాంచైజీలకు దక్కిన రేటు చూసి ఇప్పుడు గంగూలీ రూ. 40 వేల కోట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అమెజాన్ సైతం..
2018 నుంచి 2022 వరకు ఐదేళ్లకు గాను స్టార్ ఇండియా రూ. 16,347.50 కోట్లు వెచ్చించింది. టీవీ, డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులన్నీ కలిపి ఇంత మొత్తం చెల్లించింది. ఇక ప్రస్తుతం మ్యాచ్ల సంఖ్య పెరుగుతుండటంతో హక్కుల రేటు భారీగా పెరిగిపోయింది. ఐదేళ్ల క్రితం క్రీడారంగానికి సంబంధించి టీవీ, డిజిటల్ మీడియాలో సోనీ టీవీ, స్టార్ఇండియా మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సారి నాలుగు నుంచి ఐదు మీడియా సంస్థలు ఐపీఎల్ హక్కుల కోసం పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. స్టార్, సోనీ-జీటీవీ, ఓటీటీ దిగ్గజం అమెజాన్ వంటి సంస్థలు ఐపీఎల్ హక్కుల రేసులో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిజిటల్ హక్కులు దక్కించుకునేందుకు అమెజాన్ మరో టీవీ చానెల్తో ఒప్పందం కుదుర్చుకొని మరీ టెండర్ వేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












