న్యూఢిల్లీ: ఇండియన ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దూకుడు పెంచింది. కరోనా ముప్పు ఉండడంతో ఈసారి లీగ్ను యూఏఈలో నిర్వహించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రానప్పటికీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ వీకెండ్లో లీగ్కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) మీటింగ్కు పిలుపునిచ్చింది. ఈ సమావేశం విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వయంగా వెల్లడించారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా కూడా ఆదివారం జరిగే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. స్టేక్ హోల్డర్ల సందేహాలను వీరిద్దరూ క్లియర్ చేస్తారని భావిస్తున్నారు. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఈ సీజన్ ఐపీఎల్పై ఫుల్ క్లారిటీ వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
అంతేకాక ఈసారి లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసీజర్(ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది. దీంతో ప్లేయర్ల ఫ్యామిలీ మెంబర్స్ను యూఏఈ తీసుకెళ్లాలా లేదా అనే దానిపై క్లారిటి వస్తుంది. కాగా, ఖాళీ స్టేడియంలో లీగ్ జరగనుండడం వల్ల ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో రెవెన్యూ నష్టపోనున్నాయి. ఈ అంశంపై గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో చర్చిస్తామని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.
ఇక కరోనా విలయంతో ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్న భారత ప్రేక్షకులు మెరుపుల లీగ్ కోసం ఎన్నడూ లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూఏఈలో జరుగనున్న ఈ టోర్నీ మొదలైతే టీవీలకే అతుక్కుపోవడం ఖాయం.
దేవుడా..ఈ పాక్ క్రికెటర్లకు కొంచెం బుద్ది ప్రసాదించు, కుళ్లుతో రగిలిపోతున్నారు: భారత క్రికెటర్