
100 బంతులు మింగేసారు..
కరోనా కారణంగా సిరీస్లు లేకపోవడం, సరైన ప్రాక్టీస్ లభించకపోవడం, పురుషుల్లా దేశవాళీ క్రికెట్ టోర్నీలు నిర్వహించకపోవడం మిథాలీ సేన వైఫల్యానికి కారణమైంది. ఇంగ్లండ్తో జరిగిన ఫస్ట్ వన్డేలో ఇది కొట్టిచ్చినట్లు కనబడింది. ముఖ్యంగా అక్కడ ఆడిన అనుభవం లేకపోవడం మన మహిళా బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది.
స్పూర్తిదాయక పోరాటంతో ఓడిపోయే టెస్ట్లో విజయం సాధించిన మిథాలీ సేన.. వన్డేలో మాత్రం మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేయడం, ధాటిగా ఆడటంలో విఫలమైంది. 100కు పైగా బంతులను వృథా చేసింది. ఇదే భారత పతనాన్ని శాసించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

ఆ సంచలన ప్రదర్శనలు ఏమయ్యాయి?
అయితే 2017 వన్డే ప్రపంచకప్లో సంచలన ప్రదర్శన ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నది. సునాయసంగా గెలిచే మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించలేక చేతులెత్తేసింది. ఆ మరుసటి ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ ఆసాంతం అదరగొట్టిన హర్మన్ ప్రీత్ సేన కీలక సెమీఫైనల్లో మెనేజ్మెంట్ చెత్త నిర్ణయాలతో ఇంటిదారిపట్టింది.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ అదిరిపోయే ఆటతో ఓ దశలో హాట్ ఫేవరేట్గా కనిపించిన భారత మహిళల జట్టు.. కీలక ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అప్పుడూ ఒత్తిడిని అధిగమించలేకనే చేజార్చుకుంది. ఈ మూడు ప్రపంచకప్ల ప్రదర్శనలతో భారత మహిళల క్రికెట్పై కూడా అభిమానులు ఆసక్తి కనబర్చారు.
అమ్మాయి ఐపీఎల్ నిర్వహించాల్సిందే..
కానీ గతేడాదిగా.. జట్టు పెర్ఫామెన్స్ పాతాళానికి పడిపోయింది. జట్టులో ఒకరిద్దరూ మినహా.. మిగతా వాళ్లు ఎవరూ రాణించడం లేదు. ముఖ్యంగా టీమ్ వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే భారత మహిళల ప్రదర్శనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అమ్మాయిలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని, లేకుంటే శ్రీలంక పురుషుల జట్టులా తయారయ్యేలా ఉందని హెచ్చరిస్తున్నారు.
శ్రీలంక పురుషుల జట్టు కూడా గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. భారత పురుషుల జట్టు ఒకేసారి రెండు టీమ్స్తో ఆడేలా తయారైందంటే.. దానిలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించింది. కాబట్టి అమ్మాయిలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

202 టార్గెట్.. ఆడుతూ పాడుతూ..
భారత్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బీమోంట్ (87 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), సీవర్ (74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. అబేధ్యమైన మూడో వికెట్కు 119 పరుగులు జోడించారు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది.
కెప్టెన్ మిథాలీ రాజ్ (108 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (10; 1 ఫోర్), షఫాలీ వర్మ (15; 3 ఫోర్లు), హర్మన్ప్రీత్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... పూనమ్ రౌత్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (30; 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్స్టోన్ 3, కేథరిన్ బ్రంట్, ష్రబ్సోల్ చెరో 2 వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
