
అహ్మదాబాద్: సుమారు మూడు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మెగా ఫైనల్ ప్రారంభం కానుంది. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లుగా ముగింపు వేడుకలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దూరంగా ఉండగా.. ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. లక్షా 25 వేల మంది అభిమానులు హాజరైన ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్లోజింగ్ సెరమనీకి టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
వేడుకలు ప్రారంభానికి ముందు ప్రపంచంలో అత్యంత పెద్ద జెర్సీని నిర్వాహకులు ఆవిష్కరించారు. అతిపెద్ద జెర్సీగా ఇది గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. ఈ సర్టిఫికేట్ను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తన డ్యాన్స్లతో వేడుకలను ప్రారంభించాడు. ఆల్టైమ్ హిట్ సాంగ్స్కు చిందేసి అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. అన్ని రాష్ట్రాలకు చెందిన పాటలకు చిందేసి అందరిని అలరించాడు.
తెలుగు హిట్ సాంగ్ నాటు నాటు సాంగ్కు సైతం రణ్వీర్ సాంగ్ డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తన పాటలతో వేడుకలను కొనసాగించాడు. వందేమాతం, మాతృఝే సలాం, ముఖాబులా పాటలతో అభిమానులందరిని ఉర్రూతలూగించాడు. అభిమానులతో పాటు బీసీసీఐ పెద్దలు, ఇరు జట్ల ఆటగాళ్లు ఈ వేడుకలను ఆస్వాదించారు.
ఇక భారత క్రికెట్లో చోటు చేసుకున్న చిరస్మరణీయ ఘటనలను బిగ్ స్క్రీన్పై ప్లే చేసారు. ఆ సన్నివేశాలు చూస్తున్నంత సేపు అందరికి రోమాలు నిక్కబొడిచాయి. 1983 ప్రపంచకప్ గెలవడంతో పాటు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్, వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ ఘటనలు ఐపీఎల్ నిర్వాహకులు అభిమానులకు గుర్తు చేశారు.