
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్కు సంబంధించిన మీడియా రైట్స్.. ఈ వేలానికి రంగం సిద్దమైంది. ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మీడియా రైట్స్పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఐదేళ్లు(2023-28) మీడియా రైట్స్ ద్వారా రూ.50 వేల కోట్లు రాబట్టాలని బోర్డు అంచనా వేస్తోంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మీడియా రైట్స్ కోసం తొలిసారి ఈ వేలం నిర్వహించనున్నారు. జూన్ 12న ఈ ఆక్షన్ జరగనుంది.
ఈ సారి మీడియా రైట్స్ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ నాలుగు విభాగాలకు సపరేట్గా బిడ్ చేసుకోవచ్చు. 1. భారత్లో టెలివిజన్ రైట్స్, 2. డిజిటల్ రైట్స్, 3. 18 మ్యాచ్లకు సంబంధించిన నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ రైట్స్. ఇందులో సీజన్ ఓపెనర్తో పాటు నాలుగు ప్లే ఆఫ్స్, వీకెండ్ డబుల్ హెడర్లోని ఈవ్నింగ్ మ్యాచ్లు, 4 భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసే హక్కులు.
దేశంలోని మీడియా రైట్స్ కోసం స్టార్ ఇండియాతో పాటు సోనీ, స్పోర్ట్స్ 18, జీ ఎంటర్టైన్మెంట్ పోటీపడుతుండగా.. డిజిటల్ రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్, స్పోర్ట్స్ 18, సోనీ పోటీలో నిలిచాయి. అయితే ఈ సారి డిజిటల్ రైట్స్ రిలయన్స్ అధినేత అంబానికి చిక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంబానీకి చెందిన స్పోర్ట్స్ 18 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోంటుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్.. దేశంలో అతిపెద్ద ఇండస్ట్రీయల్ హౌజ్ సొంతం చేసుకోనుంది. సదరు సంస్థ ఇప్పటికే లీగ్లో భాగం కావడంతో పాటు సుదీర్ఘ కాలంగా క్రీడలను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత డిస్నీ హాట్స్టార్.. తదుపరి హక్కుల కోసం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమ కాంట్రాక్టును రెన్యూవల్ చేసుకునే ఆలోచనలో లేదు'అని ఓ బీసీసీఐ అధికారి ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. అంబానీతో పోటీని తట్టుకోలేక ఇప్పటికే అమెజాన్, గూగుల్ రేసు నుంచి తప్పుకున్నాయి.