ఐపీఎల్ ఛాంపియన్, కర్ణాటక ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కర్ణాటకు చెందిన 37 ఏళ్ల కృష్ణప్ప గౌతమ్ భారత జట్టు తరఫున ఏకైక వన్డే మ్యాచ్ ఆడాడు.
కొలంబో వేదికగా శ్రీలంకతో ఈ స్పిన్ ఆల్రౌండర్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో గౌతమ్ ఒక వికెట్ తీయడంతో ఒక పరుగు చేశాడు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక తరఫున 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 224 వికెట్లు తీసాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 మ్యాచ్ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.
2017లో ముంబై ఇండియన్స్తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన కృష్ణప్ప గౌతమ్.. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్కే జట్లకు ఆడాడు. మొత్తం 36 మ్యాచ్ల్లో 247 పరుగులతో పాటు 21 వికెట్లు పడగొట్టాడు. 2017లో ముంబై అతన్ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ సీజన్లో ముంబై ఛాంపియన్గా నిలవగా.. గౌతమ్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. 2018లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.6.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా 15 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి 126 పరుగులు చేశాడు. 2019లో ఆ జట్టు తరఫున ఒకే ఒక్క వికెట్ తీసి 11 పరుగులే చేశాడు.
2020లో పంజాబ్ కింగ్స్ ట్రేడ్ చేసుకోగా.. ఆ జట్టు తరఫున 2 మ్యాచ్లే ఆడి 42 పరుగులతో పాటు ఒక వికెట్ తీసాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రూ.9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఓ అనామక ప్లేయర్ అంత ధర పలకడం రికార్డ్. 2021లో సీఎస్కే ఛాంపియన్గా నిలవగా.. గౌతమ్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
విచిత్రం ఏంటంటే 2017లో ముంబై ఇండియన్స్ తరహాలోనే సీఎస్కే తరఫున ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. 2022లో లక్నో అతన్ని రూ.90 లక్షలకు తీసుకోగా.. మూడేళ్ల పాటు ఆ జట్టులో కొనసాగాడు. ఈ మూడేళ్లలో 12 మ్యాచ్లు ఆడి 8 వికెట్లతో పాటు 102 పరుగులు చేశాడు. రంజీ క్రికెట్లో 2016-17 సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీయడం.. 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్లో 56 బంతుల్లో 134 పరుగులు చేయడం అతని కెరీర్కే హైలైట్.