ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎకోసిస్టమ్ విలువ దారుణంగా పడిపోయింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 20 శాతం తగ్గిందని బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ తమ నివేదికలో పేర్కొంది. మెగా వేలం, జట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు లీగ్ మధ్య ఏర్పడిన భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఐపీఎల్ విలువను తగ్గించాయని తెలిపింది.
బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ అయిన బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన ఈ వార్షిక నివేదికలో గతేడాది ఐపీఎల్ ఎకోసిస్టమ్ విలువ 12 బిలియన్ల అమెరికా డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది 9.6 బిలియన్ల అమెరికా డాలర్లకు పడిపోయింది.
'భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడటంతో పాటు మెగా వేలంలో జరిగిన తప్పిదాలు, జట్టు కూర్పు విషయంలో జట్లు చేసిన తప్పిదాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. వేలం తప్పిదాల కారణంగా రసవత్తరమైన మ్యాచ్లు ఎక్కువగా జరగలేకపోయాయి.

ఐపీఎల్ 2025 సీజన్ దిద్దుబాటు కాలంగా ప్రతిబింబిస్తుంది. ఈ లీగ్ తిరిగి పుంజుకునేలా, దీర్ఘ కాలిక బ్రాండ్ విలువను బలోపేతం చేసే దిశగా పయనిస్తుంది. ప్రతీ ఏడాది సుమారు 100 రోజుల పాటు జరిగే ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఒక్క భారత్లోనే 1.5 మిలయన్లకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు స్పష్టించింది'అని బ్రాండ్ ఫైనాన్స్ తమ నివేదికలో పేర్కొంది.
జట్ల పరంగా అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గతేడాదితో పోల్చితే ఆ జట్టు విలువ 9 శాతం తగ్గినా.. 108 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ముంబై ఇండియన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ను వెనక్కినెట్టింది. ఐపీఎల్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ 105 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఆర్సీబీ విలువ 10 శాతం తగ్గినా.. మూడో స్థానం నుంచి రెండో ప్లేస్కు ఎగబాకింది.
24 శాతం క్షీణతతో అగ్రస్థానం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ 93 మిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోయింది. కేకేఆర్(74 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్(70 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్(66 డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్(59 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్(59 మిలియన్ డాలర్లు), సన్రైజర్స్ హైదరాబాద్(56 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్(53 మిలియన్ డాలర్లు)తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.